మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీదకి బ్రహ్మాస్త్రంలా ఆయన సోదరుడి కుమార్తె సంచైతని ప్రయోగించారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. చిత్రమేంటంటే, సంచైత.. బీజేపీ నేత. రాష్ట్రంలో రాజకీయాలు ఎంత చిత్రంగా వున్నాయో చెప్పడానికి సంచైతకు మన్సాస్ ట్రస్ట్ బాధ్యతల్ని వైఎస్ జగన్ సర్కార్ అప్పగించడమే నిదర్శనం.
మన్సాస్ ట్రస్ట్ పరిధిలో పెద్దయెత్తున భూములున్నాయి. పలు దేవాలయాలున్నాయి. వీటన్నిటి మీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్ను పడిందన్నది విపక్షాల ఆరోపణ. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే కొందరు బీజేపీ నేతలు కూడా, మన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు సంచైతకు అప్పగించడాన్ని తప్పుపట్టడం. ఇదిలా వుంటే, సంచైత వర్సెస్ అశోక్ గజపతిరాజు మధ్య రాజకీయ పోరు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. కేవలం అశోక్ గజపతిరాజు ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే సంచైతను తీసుకొచ్చినట్లుగా నడుస్తోంది వ్యవహారం. ఆమె కూడా, పనిగట్టుకుని బాబాయ్ మీద విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.
మరోపక్క సంచైత, ఆమె తల్లి ఎప్పుడో తమ కుటుంబానికి దూరమైపోయిందనీ, ఆమెకు ఎలాంటి వారసత్వ హక్కులూ లేవని అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. అంతే కాదు, అసలు సిసలు వారసులం తామేనంటూ ఊర్మిళ (అశోక్ సోదరుడు ఆనంద గజపతిరాజు మరో కుమార్తె) మీడియా ముందుకొచ్చారు.
ఈ వ్యవహారాలు కాస్సేపు పక్కన పెడితే, ‘ప్రసాద’ పథకం పరిధిలోకి సింహాచలం దేవస్థానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇది తన ఘనతేనని సంచైత చెబుతున్నారు. ఆ క్రెడిట్లో కొంత భాగం వైఎస్ జగన్ ప్రభుత్వానికీ ఇస్తున్నారు. అదే సమయంలో, చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనీ, అశోక్ గజపతిరాజు కూడా పట్టించుకోలేదనీ విమర్శించారు.
దానికి కౌంటర్ ఇస్తూ అశోక్ గజపతిరాజు, 2017లోనే సింహాచలం దేవస్థానం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ ‘ప్రసాద’ పథకం విషయమై విన్నవించామని, దాని ఫలితంగానే ఇప్పుడు కేంద్రం, సింహాచలం దేవస్థానానికి తీపి కబురు అందించిందని అంటున్నారు.
సంచైతకు మన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు వచ్చింది ఈ మధ్యనే.. సింహాచలం దేవస్థానం బాధ్యతల్నీ కొద్ది నెలల క్రితమే అందుకున్నారు. ఇంతలోనే ఆమె ఇవన్నీ చేయగలిగారా.? నిజమైతే మంచిదే. కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలకమైన అంశం రైల్వే జోన్. అది ప్రకటితమైందిగానీ.. అమల్లోకి రాలేదు. సంచైతకు రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులు.. కేంద్రం వద్ద పలుకుబడి వుంటే.. ఆ రైల్వే జోన్ వ్యవహారంపై బాధ్యత తీసుకోవచ్చు కదా.? ప్రత్యేక హోదా గురించి మాట్లాడొచ్చు కదా.!
కేంద్రం తరఫున రాష్ట్రానికి ఏమొచ్చినా.. అది తమ ఖాతాలో వేసేసుకోవడం వైసీపీకి అలవాటైపోయింది. ఈ క్రమంలో సంచైత, సింహాచలం క్రెడిట్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. ఇంటి గొడవలు వుంటే.. అది వేరే సంగతి. ఇంటి గొడవల్ని, రాజకీయాల్ని మిళితం చేసేస్తే ఎలా.? అన్నది ఉత్తరాంధ్రలో సంచైత రాజకీయంపై ప్రముఖంగా విన్పిస్తోన్న విమర్శ.
నా విజ్ఞప్తిని మన్నించి సింహాచలం సహా ఏపీలోని మూడు దేవాలయాలను ‘‘ప్రసాద్’’ పథకం కింద వైయస్.జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. (2/2)@Ashok_Gajapathi @ncbn garu @ysjagan garu pic.twitter.com/sFzXOWMy0f
— Sanchaita Gajapati (@sanagajapati) July 30, 2020