Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్ రెండేళ్లు మినహా) వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి పబ్లిక్ స్టేడియంలో మరింత ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈమేరకు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తోపాటు మెహర్ రమేశ్, వశిష్ట, సాయి రాజేశ్ తదితరులు ఆయన్ను ఆహ్వానించారు.
దర్శకులు సంఘం మాట్లాడుతూ.. ‘కర్ణాటక, తమిళనాడు తరహాలో దర్శకుల సంఘం వేడుకలు జరగట్లేదనే మాట ఉంది. ఈసారి వేడుకలు ఆ లోటు తీరుస్తాయి. త్రివిక్రమ్, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు మద్దతు తెలిపారు. చిరంజీవిగారు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతామన్నారు. వేడుక నిర్వహణ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి మిడ్ డే మీల్స్, కొత్త భవన నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్ధిక సాయం చేస్తాం. పరిశ్రమలోని అందరూ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతున్నా’మన్నారు.