‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా చెబుతున్నమాట. ఎన్నికల ముందర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు.
మొన్నటికి మొన్న సామాజిక పెన్షన్లు పంచాల్సిన సమయంలో, ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయలేని పరిస్థితి వస్తే, వారితో వైసీపీనే మూకుమ్మడి రాజీనామాలు చేయించింది. అందరూ రాజీనామా చేయాలని వైసీపీ హుకూం జారీ చేస్తే, కొందరే రాజీనామా చేశారు.
నిజానికి, వాలంటీర్ అనేది చాలా చాలా చిన్న పోస్ట్. గౌరవ వేతనం మాత్రమే వస్తుంది తప్ప, వాలంటీర్ పోస్టుకి ఎలాంటి గ్యారంటీ లేదు. వైసీపీ నాయకులకి ఎప్పుడు కోపమొస్తే, అప్పుడు ఆయా వాలంటీర్లను పీకి పారేస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే, వాలంటీర్లు కేవలం వైసీపీకి బానసలు మాత్రమే.
బానిసత్వం కాకపోతే, ‘వాలంటీర్లు రాజీనామా చేయాలి.. వైసీపీ కోసం పని చేయాలి..’ అని వైసీపీ హుకూం జారీ చేయడమేంటి.? వాలంటీర్లు గౌరవ వేతనంగా తీసుకుంటున్నది ప్రజాధనం. ఆ లెక్కన వాలంటీర్లు, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి.!
వాలంటీర్లంతా రాజీనామా చేసి, వైసీపీకి సహకరించాలంటూ వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.
వాలంటీర్లలోనూ ఈ విషయమై ఆత్మవిమర్శ జరుగుతోంది.! ‘మేమేం బానిసలం కాదు..’ అని వాలంటీర్లు తిరగబడుతున్న పరిస్థితీ కనిపిస్తోంది.