Prashanth Karthi: తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుండగా, అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ జె గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ప్రధాన తారాగణం. మధు బాబును దర్శకుడుగా పరిచయం చేస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఒక నిమిషం 46 సెకనుల నిడివిగల ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు.
‘‘మనతో ఉన్నటువంటి మనిషి మాయమైతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే టాలీవుడ్ తరుపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేటర్స్లో వచ్చే కలెక్షన్స్లో థియేటర్ ఖర్చులు పోను మిగిలిన ప్రతి రూపాయి ఒరిస్సాలో జరిగిన రైలు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సహాయం అందించడం జరుగుతుంది. ఇందు కోసమే ఈ సినిమాను ఈనెల 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.
దయచేసి అందరూ థియేటర్స్లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు.