ఆయన ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్. ఎన్నో వేల మందికి గుండె ఆపరేషన్లు చేశారు. కార్డియాలజీలో ఎన్నో అంశాలపై పరిశోధనలు చేసి ఆర్టికల్స్ కూడా రాశారు. హృద్రోగాలను నయం చేయడంలో ఆయన సిద్ధహస్తులు. అలాంటి వ్యక్తి అదే గుండెపోటుకి గురై చనిపోయారు. వివరాల్లోకెళ్తే..గుజరాత్ లోని జాంనగర్ కి చెందిన డాక్టర్ గౌరవ్ గాంధీ అంటే తెలియని వారు ఉండరు. దాదాపు 16 వేల మందికిపైగా గుండె ఆపరేషన్లు చేశారు. అలాంటి వ్యక్తి మంగళవారం గుండెపోటుకి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ గాంధీ మరణ వార్త ఎంతో మంది వైద్యులను ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ సోమవారం రాత్రి విధులు ముగించుకుని ప్యాలెస్ రోడ్డులోని తన నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులందరితో భోజనం చేసిన తర్వాత నిద్రకి ఉపక్రమించారు. మంగళవారం ఉదయం 6 గంటలు దాటినా ఎంతకీ డాక్టర్ నిద్ర లేవలేదు. ఆయన్ని కదిలించి చూడగా చలనం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డాక్టర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ గాంధీ గుండెపోటు పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, ఇలాంటి వ్యక్తి అదే గుండెపోటుతో చనిపోవడం బాధాకరమని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.