పంచాయతీ ఎన్నికల సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో తెలిసిన విషయమే. అంతకుమించి ఎన్నికల కమిషనర్ కూడా ఈనెల 21 వరకూ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ఉద్యోగుల్ని ఉద్దేశించి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బందికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఎస్ఈసీ రక్షణ కవచంలో ఉంటారని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా అవే చెప్తున్నాయని అన్నారు. ఎన్నికల అధికారులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు సరికావని అన్నారు. ఎస్ఈసీ అనుమతి లేకుండా ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమని.. వ్యవస్థలే శాస్వతమని ఎస్ఈసీ అన్నారు.