పెద్ద సంఖ్యలో మహిళలు, ఆడ పిల్లలు ‘అదృశ్యం’ అవుతున్నారంటే.. అది ఆషామాషీ వ్యవహారమెలా అవుతుంది.? చంద్రబాబు హయాంలో జరిగినా, వైసీపీ హయాంలో జరిగినా.. ఆంధ్రప్రదేశ్లో జరిగినా, తెలంగాణలో జరిగినా.. చిన్న విషయం కాదిది.!
పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో.. మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి.. మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో.! దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు కొందరు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నది జనసేన అధినేత ఆరోపణ.
ఈ విషయమై జనసేన అధినేత చెప్పిన 30 వేల మంది మహిళలు, ఆడ పిల్లల మిస్సింగ్ వ్యవహారం నిజమేనని చెబుతూ, కేంద్రం గణాంకాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నమాట వాస్తవం.
తెలుగు రాష్ట్రాల్ని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో. పెద్ద పెద్ద నగరాలున్న రాష్ట్రాల్లో మహిళల మిస్సింగ్ అనేది సర్వసాధారణం. అలాగని, అదీ సమర్థనీయం కాదు. ఉపాధి అవకాశాలు.. ఇతరత్రా కారణాలుంటాయి.. మిస్సింగ్, ట్రాఫికింగ్ వ్యవహారాలకు సంబంధించి.
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు పెద్దయెత్తున మహిళలు మిస్సింగ్ అవుతున్నట్టు.? ఇదే ప్రశ్న జనసేనాని సంధిస్తే, ‘చంద్రబాబు హయాంలో జరగలేదా..’, ‘తెలంగాణలో జరగడంలేదా.?’ అంటూ ఎదురుదాడికి దిగుతోంది వైసీపీ.
అంటే, ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్ అనేది పాలకులకు అస్సలు పట్టని విషయం అన్నమాట.! అంతే కదా.? జనం పోతే పోనీ.. మాకేంటి.? అన్నట్లు వ్యవహరిస్తోంది అధికార వైసీపీ. ఇంతకీ, మహిళా కమిషన్ ఎక్కడ.? జనసేనానికి నోటీసులు జారీ చేయడానికి తప్ప, దేనికీ పనికిరాదన్న బలమైన ముద్ర వేయించుకుంది.. ఏపీ మహిళా కమిషన్.!