Janasena-TDP: లెక్కలన్నీ పక్కాగానే కనిపిస్తున్నాయ్.! చెరి సగం దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అడుగులు ముందుకేయక తప్పేలా లేదు.!
2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు నారా లోకేష్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రకు అనుబంధంగా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
ఏం చేసినాసరే, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే, జనసేన సాయం తీసుకోక తప్పని పరిస్థితి. బీజేపీతో కూడా కలవాలని చంద్రబాబు ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే, టీడీపీతో కలిసే విషయమై బీజేపీ ఒకింత తటపటాయిస్తోంది.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది జనసేన అధినేత ఆలోచన. అలా జరగాలంటే, టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. ఆ దిశగానే, జనసేన అధినేత పావులు కదుపుతున్నారు కూడా.
కాగా, జనసేనకు కేవలం 10 నుంచి 20 సీట్లు మాత్రమే పొత్తులో భాగంగా ఇవ్వాలని తొలుత టీడీపీ భావించింది. ఓ ఎంపీ సీటు జనసేనకు ఇస్తే సరిపోతుందన్నది గతంలో టీడీపీ చేసిన ఆలోచన. బీజేపీకి రెండో మూడో అసెంబ్లీ సీట్లు ఇచ్చి, ఓ రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలనీ టీడీపీ భావించింది.
కానీ, ఈక్వేషన్స్ మారాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకి ‘వారాహి విజయ యాత్ర’తో పెరిగిన బలం నేపథ్యంలో, మొత్తంగా 175 నియోజకవర్గాలుంటే.. అందులో సగం, జనసేనకు ఇవ్వడమే బెటర్.. అని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారన్నది తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.
సగం కాదుగానీ, ఓ అరవై సీట్ల వరకు జనసేనకు టీడీపీ కేటాయిస్తే మంచిదేనని తెలుగు తమ్ముళ్ళూ అనుకుంటున్నారట. ఆ అరవై కాస్తా 75 ఆ పైనకు పెరిగి, చెరి సగం అవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఈక్వేషన్స్ అలా మారుతున్నాయ్ మరి.!