ప్రత్యేక హోదా సాధించేది మేమేనంటూ మీసం మెలేసిన వీరులెక్కడ.? ప్రధాని నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చి, కేంద్ర హోం శాఖ ద్వారా ప్రత్యేక హోదాపై చర్చ జరిగేలా చేశామని చెప్పుకున్న శూరులెక్కడ.? ప్రత్యేక హోదా లేదు, చింతకాయ పచ్చడీ లేదు. కేంద్రం, ప్రత్యేక హోదా అంశాన్ని ‘హోంశాఖ ఉప సంఘం భేటీ’ నేపథ్యంలో ఎజెండాగా పెట్టినట్టే పెట్టి, ఆ తర్వాత పీకి పారేస్తే.. కేంద్రాన్ని నిలదీయాల్సిన టీడీపీ, వైసీపీ.. తమలో తాము కుమ్ములాడుకున్నాయి. ఆ తర్వాత ఎవరికి వారు సైలెంటయిపోయారు.
నువ్వు కొట్టినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తాను.. అన్నట్టుంది టీడీపీ, వైసీపీ తీరు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అధికారికంగా స్పందించరు.? కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు.? గతంలో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఓ చిన్నపాటి నిరసన దీక్ష అయినా ఎందుకు చేయడంలేదట.?
గతంలో బందులు, ఆందోళనలు, ర్యాలీలు.. ఇలా రాష్ట్రమంతా హోరెత్తేలా ప్రత్యేక హోదా విషయమై రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ, ఇప్పుడెక్కడా అలాంటి హడావిడి చేయలేకపోతోంది. కొత్త జిల్లాల కోసం వైసీపీ ఎమ్మెల్యేలే రోడ్డెక్కుతున్న పరిస్థితి. అలాంటివారెవరికీ ప్రత్యేక హోదా పట్ల కనీసపాటి శ్రద్ధ లేకపోవడాన్ని ఏమనుకోవాలి.?
ప్రత్యేక హోదాని చంద్రబాబు పాతరేశారని వైసీపీ, కాదు కాదు.. ప్రత్యేక హోదాని తన కేసుల నిమిత్తం వైఎస్ జగన్ తాకట్టుపెట్టేశారని టీడీపీ.. ఈ ఆరోపణలు వినీ వినీ జనానికి విసుగొచ్చింది. అయినాగానీ, ఆ రెండు పార్టీలకూ అస్సలేమాత్రం విసుగు రావడంలేదు.
టైమ్ పాస్ వ్యవహారంలా అప్పుడప్పుడూ రంకెలేయడం (మొరగడం అంటే బాగోదేమో.!) మినహా, వైసీపీ, టీడీపీ చేసిందీ, చేస్తున్నదీ, చేసేదీ ఏమీ లేదు, వుండదు.