చంద్రబాబు అప్పులు చేసి రాష్ట్రాన్ని మంచేశారు.. వైఎస్ జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ.. నిత్యం చేస్తున్న ఆరోపణలివి. మిగిలిన రాజకీయ పార్టీలైన బీజేపీ, జనసేన కూడా, రాష్ట్రం మీద మోపబడుతున్న అప్పుల భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం.
ఔను, చంద్రబాబు హయాంలో రికార్డు స్థాయిలో అప్పులు జరిగాయి. ఔను, ఆ రికార్డుని తిరగరాసింది వైఎస్ జగన్ సర్కారు.! కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవమిది. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే అప్పులు జరుగుతున్నాయని అప్పట్లో చంద్రబాబు అండ్ టీమ్ చెబితే, ఇప్పుడు వైఎస్ జగన్ అండ్ టీమ్ అదే మాట చెబుతోంది.
ఇక్కడ అసలు విషయమేంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. అంటే, ఇది తోడు దొంగల గూడు పుఠానీ.. అన్నుకోవాలన్నమాట. కేంద్రాన్ని రాష్ట్రాలు నిలదీయవు, రాష్ట్రాల్ని కేంద్రం గట్టిగా నిలదీయదు. ఇక్కడే, జనం నిండా మునిగిపోతున్నారు.
దేశం సంగతి పక్కన పెట్టి, రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేని స్థాయిలో అప్పులు జరుగుతున్నాయన్నది ఓ వాదన. ఓ టీడీపీ నేత, ఆర్థిక వ్యవహారాలపై ఒకింత అవగాహన వున్న ఓ యువ నాయకుడు, శ్రీలంకలో సగటున ప్రతి మనిషి మీదా వున్న అప్పు కంటే, దాదాపు రెండు రెట్లు అప్పు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి మీదా వుందని చెబుతున్నారు.
ఇదే నిజమైతే, ఇంతకన్నా దారుణం ఇంకోటుండదు. అయినాగానీ, ‘అబ్బే, మేం చంద్రబాబు కంటే జాగ్రత్తగా అప్పులు చేస్తున్నాం.. చంద్రబాబు హయాంలో 19.4 శాతం, మా హయాంలో 15.77 శాతం.. అంటూ వైసీపీ సర్కారు చెబుతోంది. మరి, అప్పులెలా పెరుగుతున్నాయ్.? ఆ ప్రశ్నకైతే సమాధానం లేదు.
ప్రజలకు వాస్తవాలు చెప్పడం ప్రభుత్వాలెప్పుడో మానేశాయ్. ప్రజలకీ, ప్రభుత్వాల అప్పులతో పనిలేదు. అదే అసలు సమస్య. శ్రీలంక ఇప్పుడెదుర్కొంటున్న దుస్థితి తెలుగు రాష్ట్రాలకిగానీ, దేశానికిగానీ రాకూడదని దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం.
329985 409348I like this blog so a lot, saved to bookmarks . 110172