రేపు ఉదయం.. అంటే, మే 22వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ యెదుట విచారణకు హాజరు కావాల్సి వుంది కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి. కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి, సీబీఐ విచారణకు డుమ్మా కొట్టేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రస్తుతం అవినాశ్ రెడ్డి తల్లి గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. నిజానికి, శుక్రవారం సీబీఐ యెదుట అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి వుండగా, అదే రోజు ఉదయం అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యమంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత హై డ్రామా నడిచింది. అవినాశ్ రెడ్డి, సీబీఐ యెదుట విచారణకు హాజరు కాలేదు.
కాగా, రేపటి విచారణకు సైతం హాజరు కాలేనంటూ అవినాశ్ రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారట. తన తల్లికి సర్జరీ జరగనుందనీ, ఆమెను తానే చూసుకోవాల్సి వుందనీ, ఓ పది రోజులపాటు విచారణకు హాజరు కాలేననీ సీబీఐకి అవినాశ్ రెడ్డి సమాచారం పంపారట.
ఈ వ్యవహారంపై సీబీఐ సీరియస్ అవుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఉదయం విచారణకు హాజరవ్వాల్సిందేనని అవినాశ్ రెడ్డికి సీబీఐ అల్టిమేటం కూడా ఇచ్చిందట. దాంతో, రేపు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.
‘నువ్వు కొట్టినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అన్నట్టుంది వ్యవహారం. అరెస్టు విషయమై సీబీఐ మీనమేషాల్లెక్కెడుతోంది. ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇరువైపుల నుంచీ ఇంత హైడ్రామా అవసరమా.?