2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వున్నపళంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మార్చి – ఏప్రిల్లలో ఎన్నికలు జరుగాల్సి వుండగా, ఫిబ్రవరిలోనే ఎన్నికల నగారా మోగుతుందంటూ ప్రచారం షురూ అయ్యింది.
అధికార వైసీపీ, నియోజకవర్గాల ఇన్ఛార్జిలను పెద్దయెత్తున మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్న దరిమిలా, విపక్షాలూ అలర్ట్ అవ్వాల్సిన ‘అవసరం’ ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ – జనసేన అలాగే జనసేన – బీజేపీ పార్టీల మధ్య విడివిడిగా పొత్తు వుంది.
బీజేపీ ప్రస్తుతానికి జనసేనతో కలిసే వుంది. టీడీపీతోనూ బీజేపీ కలుస్తుందా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. బీజేపీ కలవని పక్షంలో, టీడీపీ – జనసేన కూటమితో వామపక్షాలు కలవొచ్చు. జనసేనను కాదని వైసీపీతో బీజేపీ నడుస్తుందా.? ఒంటరిగానే బీజేపీ వెళుతుందా.? అన్నదానిపై క్లారిటీ లేదు.
ఇదిలా వుంటే, టీడీపీ – జనసేన పొత్తు ఖాయమైనా, టీడీపీ సోషల్ మీడియా విభాగంలో కొందరు జనసేన విషయంలో ‘ఓవరాక్షన్’ చేస్తున్నారు. అది కాస్తా గ్రౌండ్ లెవల్లో టీడీపీ – జనసేన పొత్తుని దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇంతా జరుగుతున్నా, చంద్రబాబు అలాగే నారా లోకేష్.. ఈ విషయంలో చర్యలు తీసుకోలేకపోతున్నారు.
టీడీపీ అను‘కుల’ మీడియా ద్వారా జనసేనకి కేవలం పది నుంచి పన్నెండు సీట్లేనంటూ ప్రచారం చేయిస్తుండడం వెనుక అసలు కుట్ర ఎవరిది.? అన్నది తేలాల్సి వుంది. ఈ విషయమై జనసేన శ్రేణుల్లో ఒకింత అసహనం పెరిగిపోతోంది.
జనసేన – టీడీపీ కలయిక అన్నది జనసేన కంటే, టీడీపీకే ఎక్కువ అవసరం. పొత్తు కుదిరినా ఇరు పార్టీల మధ్యా ఓట్ షేరింగ్ సరిగ్గా జరగడం కూడా టీడీపీకే అవసరం. కానీ, టీడీపీ ఈ విషయంలో తగిన శ్రద్ధ పెట్టడంలేదు. ఉద్దేశ్యపూర్వక ఆలస్యం, టీడీపీని సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి నెట్టేస్తున్నట్లే కనిపిస్తోంది.