‘వాల్మీకి’ సినిమా టైటిల్ వివాదంలో ఇరుక్కోవడం.. చివరి నిమిషంలో సినిమా టైటిల్ని ‘గద్దలకొండ గణేష్’గా మార్చాల్సి రావడం.. అన్నీ అనూహ్యంగా జరిగిపోయాయి. సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినీ పరిశ్రమ మొత్తం ‘వాల్మీకి’ టీమ్కి అండగా నిలిచింది. మరోపక్క, సినిమా టైటిల్ మార్చిన తర్వాత కూడా అక్కడక్కడా సినిమాకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు కొందరు.
సెన్సార్ సర్టిఫికెట్లో ‘వాల్మీకి’ పేరుని తొలగించాలనీ.. దాంతోపాటుగా, ఇప్పటిదాకా విడుదల చేసిన ప్రోమోస్ అన్నీ మార్చాలనీ వింత వాదనల్ని తెరపైకి తెస్తున్నారు ఆందోళనకారులు. ఇదిలా వుంటే, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపైనా కొందరు కన్నేశారనీ, టైమ్ చూసి దెబ్బ కొట్టేందుకు తెరవెనుక వ్యూహాలు సిద్ధమవుతున్నారనీ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.
‘వాల్మీకి’ వివాదం ఎలాగైతే రాయలసీమలో పుట్టుకొచ్చిందో, ‘సైరా’ మీద వివాదం కూడా అదే రాయలసీమ నుంచి రాబోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమకి చెందిన పోరాటయోధుడు. సినిమా కథ విషయమై ఉయ్యాలవాడ వంశస్తులమంటూ కొందరు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేశారు. ఆ మధ్య చిరంజీవి ఇంటి ముందు కూడా కొందరు నానా యాగీ చేసేందుకు ప్రయత్నించిన విషయం విదితమే.
అయితే, ఆ వివాదాలు ఎలాగోలా సద్దుమణిగాయి. కానీ, విడుదలకు ముందు ‘సైరా’ వివాదాల్ని ఎదుర్కో తప్పదనీ, తెరవెనుక రాజకీయ ఒత్తిళ్ళు ‘సైరా నరసింహారెడ్డి’కి అడ్డంకిగా మారబోతున్నాయనీ.. సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్లో ఓ రాజకీయ పార్టీ కొంతకాలంగా అసహనంతో వుందనీ, ఇప్పుడు ఆ రాజకీయ పార్టీనే ‘వాల్మీకి’ వివాదాన్ని రాజేసిందనీ, ‘సైరా’ విషయంలోనూ ఆ రాజకీయ పార్టీ ముఖ్య పాత్ర పోషించబోతోందనీ తెలుస్తోంది.
‘వాల్మీకి’ పరిస్థితి వేరు.. ‘సైరా నరసింహారెడ్డి’ పరిస్థితి వేరు. టిక్కెట్ల ధర పెంపు, అదనపు షోలు.. ఇలా చాలా వ్యవహారముంటుంది ‘సైరా నరసింహారెడ్డి’కి. మరి, ఆ విషయాల్లో నిర్మాత రామ్చరణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతారా.? ఎలాంటి వివాదాల్లేకుండా ‘సైరా’ విడుదల ప్రశాంతంగా జరుగుతుందా.? వేచి చూడాల్సిందే.
