ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్త పాపులారిటీ సంపాదించుకున్న ‘ఐ-ప్యాక్’ టీమ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి విశేష సేవలు అందించిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా పనిచేశాడాయన అప్పట్లో. ఆయన అనుకున్నది సాధించేశాడు కూడా.!
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం కూడా ఆయన పని చేశాడు. చాలా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ టీమ్, అక్కడి రాజకీయ పార్టీల తరఫున వ్యూహాత్మకంగా పని చేసి, ఆయా రాజకీయ పార్టీల్ని గద్దెనెక్కించడం చూశాం.
ప్రశాంత్ కిశోర్ సమర్థత ఏంటి? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్రమమో, సక్రమమో.. తీసుకున్న సొమ్ములకి న్యాయం చేయడం అతని లక్ష్యం. వందల కోట్లలో కాదు, అంతకు మించిన రీతిలో అతని ఫీజు వుంటుందనేది అంతటా వినిపించేమాట.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, ప్రశాంత్ కిశోర్కి గట్టిగానే సమర్పించుకోవాల్సి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు ఇదే ప్రశాంత్ కిశోర్ని తీవ్రవాదిగా అభివర్ణించడం చూశాం. అదే చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ ముందర మోకరిల్లినట్లే కనిపిస్తోంది.
ప్రశాంత్ కిశోర్, అప్పట్లో జగన్ని గెలిపించిన దరిమిలా, ఇప్పుడు చంద్రబాబుని గెలిపించేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఎవరైతేనేం, ఎక్కడ సొమ్ములు బాగా గిట్టుబాటు అయితే, అక్కడ పని చేయడం ప్రశాంత్ కిశోర్కి అలవాటు. అయినా, వైసీపీ కూడా గట్టిగానే ఇస్తుంది కదా.? ఎందుకు వైఎస్ జగన్కి ప్రశాంత్ కిశోర్ దూరమయినట్లు.?
వైఎస్ జగన్, ప్రశాంత్ కిషోర్ మధ్య ఎక్కడ చెడినట్టు.. అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీయార్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్, తెలంగాణలో గులాబీ పార్టీని ఇంకోసారి అధికారంలోకి తీసుకురాలేకపోయారు. నిజానికి, ముందుగానే గులాబీ పార్టీతో ప్రశాంత్ కిషోర్ (అంటే, ఎన్నికలకు ముందరగానే) తెగతెంపులు చేసుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.
అయినాగానీ, తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ పప్పులుడకలేదు గనుక, ఏపీలోనూ అదే పరిస్థితి అన్న నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చేశారన్నది ఓ వాదన. ఇంకోపక్క, నియోజకవర్గ ఇన్ఛార్జిల మార్పు విషయమై ప్రశాంత్ కిశోర్ సూచనల్ని జగన్ పెడ చెవిన పట్టారనీ, ఈ క్రమంలో ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగి వుండొచ్చనీ ఇంకో వాదన వినిపిస్తోంది.
కారణం ఏదైతేనేం.? ఒకప్పుడు ప్రశాంత్ కిశోర్ ప్రాపకం కోసం మోకరిల్లిన వైసీపీ నేతలంతా, ఇప్పుడు టీడీపీ కోసం పనిచేయనున్న ప్రశాంత్ కిశోర్ని తూలనాడుతున్నారు. అప్పట్లో ప్రశాంత్ కిశోర్ని తూలనాడిన టీడీపీ, ఇప్పుడాయన్ని నెత్తిన పెట్టుకుంది.
ఇంతకీ, ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తారా.? ఆ అతి నమ్మకంతోనే జనసేనకు దూరమవ్వాలనే ఆలోచన టీడీపీ చేస్తోందా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.