పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గనుక మూడంకెల సీట్లు సాధిస్తే, తాను రాజకీయ వ్యూహకర్తగా ఇకపై పనిచేయబోనంటూ ‘ఐప్యాక్’ ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల క్రితం సంచలన రీతిలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియనివారుండరు. ఐప్యాక్ సంస్థ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ వ్యూహాల్ని రచిస్తుంటారు ప్రశాంత్ కిషోర్. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకీ, తమిళనాడులో డీఎంకే పార్టీకి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకీ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు రచించారు. ఇలా రాజకీయ వ్యూహాలు రచించే క్రమంలో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు ప్రశాంత్ కిషోర్.
ఇక, తాజాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే, మమతా బెనర్జీ తిరిగి అధికారం నిలబెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ 100 సీట్ల మార్కుని అందుకోలేకపోయింది. అయినాగానీ, తాను వ్యూహకర్తగా ఇకపై పనిచేయబోనని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. తనను కొందరు దారుణంగా ట్రోల్ చేశారనీ, వారందరూ ఇకపై హ్యపీగా వుండొచ్చని చెప్పిన ప్రశాంత్ కిషోర్, అద్భుతమైన గెలుపుతో వ్యూహకర్త అనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.
కుటుంబ సభ్యులతో కొన్ని నెలల పాటు హ్యాపీగా గడపాలనుకుంటున్నాననీ, ఆ తర్వాత మరో వ్యాపకం వెతుక్కుంటాననీ, ఐప్యాక్ వైపు మళ్ళీ రావడం జరగబోదనీ ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. నిజానికి, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ కోసం వివిధ రాజకీయ పార్టీలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే పరిస్థితి రావొచ్చు. మరి, వారందరికీ ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చినట్లేనా.?