సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. దేశవ్యాప్తంగా మిగిలిన స్థానాల్లో ఆదివారం తుది విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిశాక సాయంత్రం 6 గంటల నుంచి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాలని ఎన్నికల సంఘం నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. దీంతో జాతీయ, ప్రాంతీయ టీవీ ఛానళ్లు, సర్వే సంస్థలన్నీ ఆదివారం సాయంత్రం తమ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే, ఆంధ్రా ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం అనూహ్యంగా ఒక్కరోజు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి తన సర్వే ఫలితాలు ఇవీ అంటూ వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం సాయంత్రం తిరుపతిలో తన సర్వే వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుపొందడం ఖాయమంటూ లీకులు ఇవ్వడానికి కారణం ఏమిటా అని పలువురు ఆరా తీస్తున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా లగడపాటి ముందుగానే తన అంచనాలు ఇవీ అంటూ లీకులిచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిదే గెలుపు అని పోలింగ్ జరగడానికి ముందే ప్రకటించారు. దీనిపై అధికార టీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. లగడపాటి తనకు పంపిన సర్వే వివరాలు ఇవీ అంటూ వాట్సాప్ స్క్రీన్ షాట్ ను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకే లగడపాటి ఇలా అవాస్తవాలు చెబుతున్నారంటూ విమర్శించారు. పర్సనల్ చాట్ బయటపెట్టడం సబబు కాదని, కానీ లగడపాటి వల్ల తమ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతోనే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత సైతం లగడపాటి మహాకూటమిదే అధికారం అంటూ తన సర్వే ఫలితాలు వెల్లడించారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంతో లగడపాటి కొన్నాళ్లపాటు కనిపించలేదు. కేవలం బెట్టింగులను ప్రోత్సహించడానికి, తన సర్వే ఫలితాల ద్వారా బెట్టింగ్ లో కోట్ల రూపాయలు ఆర్జించాలనే కుట్రతోనే లగడపాటి ఇలా తప్పుడు సర్వే ఫలితాలు వెల్లడించారని అప్పట్లో విపరీతంగా విమర్శలు వచ్చాయి. అప్పటివరకు ఆయన చెప్పిన చాలా సర్వేలు నిజం కావడంతో లగడపాటి సర్వే కోసం జనం అంతా ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతో లగడపాటి తప్పుడు సర్వే ఫలితాలు ప్రకటించారంటూ టీఆర్ఎస్ తోపాటు వైఎస్సార్ సీపీ కూడా విరుచుకుపడింది.
తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ లగడపాటి అలాగే వ్యవహరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముందుగా ప్రకటించినట్టుగానే ఏపీ ఫలితాలను కూడా ఒక్క రోజు ముందుగానే బయటపెట్టారు. ఇక్కడ కూడా బెట్టింగ్ లలో తనకు, తన వాళ్లకు లాభం చేకూర్చేందుకే లగడపాటి తప్పుడు సర్వే ఫలితాలు చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, తన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఎవరూ బెట్టింగులు కట్టొద్దని కూడా ఆయన హెచ్చరించారు.
మరోవైపు చంద్రగిరి రీ పోలింగ్ పై ప్రభావం చూపించడానికే లగడపాటి ముందుగా ప్రకటన చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం 6వేల మంది ఓటర్లను ప్రభావితం చేయడానికి తన విశ్వసనీయతనే ఫణంగా పెడతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తన ఫలితం తప్పితే ఇక ఎవరూ కూడా తనను నమ్మబోరని లగడపాటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ లెక్కన చూస్తే లగడపాటి చెప్పిందే నిజం కానుందా? ఏపీలో సైకిల్ జోరు చూపించనుందా అనే అంశాలపై జోరుగా చర్చ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్ ఫలితాలతో వీటన్నింటిపై కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా గందరగోళంగా ఉంటే ఇక ఈనెల 23 వరకు వేచిచూడక తప్పదు.
196868 659936the most common table lamp these days still use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 416971