జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకోసారి అదే మాట చెప్పారు. అదే మాట అంటే, ‘నువ్వెంత.? నీ బతుకెంత.?’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడటం. ‘పోలీసులతో మా మీద కేసులు పెట్టిస్తున్నారు.. చూస్తూనే వుండండి, మేం అధికారంలోకి వచ్చాక.. ఇదే పోలీసులతో మీ మక్కెలిరగదీయిస్తాం..’ అంటూ అధికార వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత.
కొల్లేరు భూముల్ని కాపాడతామని ముదినేపల్లిలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘ఇంటర్ సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇవ్వలేని ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తుందా.? ప్రింటింగ్ విషయంలో కమిషన్లు సెట్ కాకపోవడం వల్లే ఆలస్యమా.?’ అంటూ ఎద్దేవా చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కొడుకు చేస్తున్న అరాచకాల్ని ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారనీ, వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని జనసేనాని చెప్పుకొచ్చారు. ‘నువ్వు నొక్కని బటన్లు..’ అంటూ నియోజకవర్గంలో రోడ్లు సహా, పలు అంశాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ లిస్టులో పోలవరం ప్రాజెక్టుని కూడా ప్రస్తావించారు.
‘టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. టీడీపీ నేతలూ, మా జనసేన నేతలు అలాగే కార్యకర్తల్ని బాగా చూసుకోండి. గతంలో ఏమైనా పొరపాట్లు వుంటే, కూర్చుని.. మాట్లాడుకుని చర్చించుకోండి.. వైసీపీకి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. ఎక్కడా టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ వుండకూడదు..’ అని ముదినేపల్లి వారాహి విజయ యాత్ర సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి సూచించారు.
‘మేం ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాలేదు. ఒకవేళ వస్తే, ఆ విషయం నేనే ప్రకటిస్తాను. వైసీపీ ఈ విషయంపై అత్యుత్సాహం చూపాల్సిన పనిలేదు. మీ దుష్ప్రచారం కట్టిపెట్టండి..’ అంటూ జనసేనాని, టీడీపీ కోసం ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడంపై స్పష్టతనిచ్చారు.
‘అయినా, మేం ఎన్డీయేలో వుంటే మీకేంటి.? లేకపోతే మీకేంటి.? మీరు వైనాట్ 175 అంటున్నారు కదా.? మీకెందుకు మా మీద బెంగ.?’ అంటూ వైసీపీని ప్రశ్నించారు జనసేనాని. ‘నేను గనుక, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వుంటే.. అసలు విపక్షాల గురించి మాట్లాడేవాడినే కాదు.. అదీ నా పద్ధతి. నిజాయితీకి వుండే ధైర్యం అది. మీరేమో, భయంతో వున్నారు అన్ని సీట్లు గెలిచినా సరే.!’ అని జనసేనాని వైసీపీ మీద మండిపడ్డారు.
ముదినేపల్లి వారాహి విజయ యాత్రకు జనం పోటెత్తారు. ఈ విడత వారాహి యాత్రలో ఈ సభకు అత్యంత ఎక్కువగా జన సంద్రం పోటెత్తింది. అడుగడుగునా పోలీసుల ఆటంకాలు ఎదురైనా, జనసైనికులు అస్సలేమాత్రం తగ్గలేదు. టీడీపీ శ్రేణులు కూడా ముదినేపల్లి వారాహి యాత్రకు మరింత ఎక్కువగా పోటెత్తడం గమనార్హం.
చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, మహేష్బాబు, అల్లు అర్జున్.. ఇలా ఆయా హీరోల అభిమానులందరూ జనసేన పార్టీకి మద్దతిస్తున్నందుకు ఆనందంగా వుందని జనసేనాని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ అభిమానులకీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతూ, ‘రజనీకాంత్ని కూడా వైసీపీ నేతలు దారుణంగా తిట్టారంటూ’ జనసేనాని చెప్పుకొచ్చారు.
‘హేయ్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసినవాడిని నేను. నువ్వెంత.? నీ బతుకెంత.? రేపు మేం అధికారంలోకి వచ్చాకా మొత్తం కక్కిస్తా.. కొల్లేరు అక్రమాలను బయటకు తీస్తా..’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.