ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి యమగంటి కన్నయ్య గౌడ్(35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయి నగర్ లో నివాసం ఉంటున్న కన్నయ్య ఆదివారం ఉదయం ఉరేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి కన్నయ్య గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆర్థిక ఇబ్బందులతోనే కన్నయ్య బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ నుంచి ఇటీవలే కన్నయ్య నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. మరో 10 రోజుల్లో పోలింగ్ ఉండగా కన్నయ్య మృతి చెందడంతో విషాదం నెలకొంది.