సోషల్ మీడియా అంటేనే ఛండాలం.. అనే స్థాయికి ఫేక్ వార్తలు, దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కొందరు నెటిజన్లు.! రాజకీయం వాళ్ళతో అలా చేయిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు పార్టీలూ ‘దుష్ప్రచారంలో’ ఒకర్ని ఇంకొకరు మించిపోయి తమ స్థాయిని మరింతగా దిగజార్చేసుకుంటుండడం గమనార్హం.
అసలు విషయానికొస్తే, తెలంగాణలో జనసేన – బీజేపీ పొత్తుపై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనీ, జనసేనపై తీవ్ర విమర్శలు చేశారనీ పేర్కొంటూ సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు దర్శనమిచ్చాయి.
కిషన్ రెడ్డి కేవలం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మాత్రమే కాదు, కేంద్ర మంత్రి కూడా. జనసేన వల్ల బీజేపీ నష్టపోయినట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారన్నది టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా విభాగం తరఫున కొందరు చేస్తున్న ఆరోపణల సారాంశం.
ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎన్టీయే కూటమిలో భాగంగా వున్నందునే ‘జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయడం జరిగిందనీ, పవన్ కళ్యాణ్పై తానెలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
‘ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఉద్దేశ్యపూర్వక ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం..’ అని సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేవలం ఈ తరహా హెచ్చిరకలతో సరిపెట్టుకుంటే కుదరదు. నిజానికి, ఇలాంటి దుష్ప్రచారాలపై కేంద్ర మంత్రి హోదాలో మరింత సీరియస్గా వ్యవహరించాల్సి వుంటుంది.
తెలంగాణలో బీజేపీకి జనసేన మద్దతిచ్చింది. అనుకున్న స్థాయిలో రెండు పార్టీలూ అధికారం దిశగా సత్తా చాటలేకపోయిన మాట వాస్తవం. అయితే, జనసేన వల్ల బీజేపీ బాగానే లాభపడింది.. సీట్ల పరంగా, ఓట్ల పరంగా కూడా.! ఈ విషయం బీజేపీ పెద్దలకీ తెలుసనుకోండి.. అది వేరే సంగతి.
అయితే, ఎన్నికల ఫలితాల నుంచీ దుష్ప్రచారం జరుగుతున్నా, ఖండించడానికి ఇంత సమయం బీజేపీ తీసుకోవడమే అన్ని అనర్ధాలకీ కారణం.