తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఇటీవల అనారోగ్యం సంభవించింది. ప్రమాదవశాత్తూ జారి పడ్డంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఇది జరిగి చాన్నాళ్ళే అయ్యింది. ఇప్పుడు, కాస్త తీరిక చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీయార్ని హైద్రాబాద్లో పరామర్శించారు.
ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరోజూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీరిక దొరకలేదా.? సరిగ్గా ఢిల్లీలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రోజునే, జగన్ మోహన్ రెడ్డి హైద్రాబాద్ ఎందుకు వచ్చినట్లు.? దాదాపు రెండేళ్ళ తర్వాత హైద్రాబాద్లోని లోటస్ పాండ్లో తన తల్లి విజయమ్మను ఎందుకు కలిసినట్టు.?
తెలుగునాట రాజకీయాల్లో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయి కూర్చుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితికి సంపూర్ణ సహకారాలు అందించిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదీ తెరవెనుకాల.!
వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసిన విషయం విదితమే. గ్రౌండ్ లెవల్లో అయితే, బీఆర్ఎస్ పార్టీ జెండాల్ని పట్టుకు తిరిగారు వైసీపీ సానుభూతిపరులు. అయినా, గులాబీ పార్టీ ఓడిపోయింది. అలా ఓడిపోయిన గులాబీ పార్టీకి జగన్ నుంచి పరామర్శ ఇన్నాళ్ళకు జరిగిందన్నమాట.
షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రోజునే, జగన్ ఎందుకు హైద్రాబాద్ వెళ్లి, కేసీయార్ని కలిసినట్టు.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘వైఎస్ జగన్ తన దత్త తండ్రి కేసీయార్ వద్దకు వెళ్ళారు..’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతుండడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో తమకు సహకరించినట్లుగా ఈసారీ సహకరించాలని దత్త తండ్రి కేసీయార్ని వైఎస్ జగన్ బతిమాలుకున్నారట.. కాళ్ళా వేళ్ళా పడి మరీ.. అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు.