ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ఓ తీపి కబురు అందింది. క్యాబినెట్ భేటీ నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే, క్యాబినెట్ భేటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడిన ఎజెండాను సిద్ధం చేసిన చంద్రబాబు, స్క్రీనింగ్కి పంపడం, ఆ తర్వాత అది కేంద్ర ఎన్నికల సంఘానికి చేరడం జరిగిపోయాయి. నిజానికి ఈ రోజు ఉదయమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ‘సమాధానం’ రావాల్సి వున్నా, కాస్త ఆలస్యంగా సాయంత్రానికి ‘లైన్ క్లియర్’ అయ్యింది.
ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్యాబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఏం చేయాలన్న విషయమై ఈ మేరకు ఇద్దరి మధ్యా చర్చ జరిగినట్లు కూడా ప్రచారం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదనే విషయాన్నే చంద్రబాబు దృష్టికి ఏపీ చీఫ్ సెక్రెటరీ తీసుకెళ్ళారనే ఊహాగానాలూ విన్పించాయి. కానీ, ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది.
మండుతున్న ఎండలు, కరువు, ఇటీవల సంభవించిన ఫోని తుపాను కారణంగా తలెత్తిన నష్టం.. వంటి అంశాలు క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఎజెండాలో ముఖ్యంగా చేర్చారు. ఎన్నికల కోడ్ కారణంగా క్యాబినెట్ భేటీ జరిగే అవకాశాలే లేవని రాజకీయ విశ్లేషకులు చూచాయిగా అభిప్రాయపడిన వేళ, కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు సర్కార్కి ఆ అవకాశం కల్పించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, క్యాబినెట్ భేటీ అనేది సాధారణ ప్రక్రియ మాత్రమేననీ, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం వీల్లేదనే అభిప్రాయాలు ఇంకా వ్యక్తమవుతూనే వున్నాయి.
ఎన్నికల పోలింగ్ ముగిసి, ఫలితాల విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్న ఈ సమయంలో క్యాబినెట్ భేటీ పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒకింత ‘పంతం పట్టినట్లే’ వ్యవహరించారని ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. ఎలాగైతేనేం, ఆయన పంతం నెగ్గింది. ఎవరూ ఊహించని విధంగా క్యాబినెట్ భేటీ జరిపేందుకు చంద్రబాబుకి అవకాశం దక్కింది. దాదాపుగా ఏపీ మంత్రులంతా నీరసించిపోయిన వేళ ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్ వారందరికీ ‘ఆక్సిజన్’ అందించినట్లయ్యింది.
అయితే, ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది కదా అని, చంద్రబాబు క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ‘అధికారంలోకి వచ్చేది మేమే, ఇప్పుడు మీరు ఎలాంటి అత్యుత్సాహపు నిర్ణయాలు తీసుకున్నా, మేం అధికారంలోకి వచ్చాక వాటిని సమీక్షిస్తాం, మీ అత్యుత్సాహం అంతు తేల్చుతాం..’ అని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఎవరి గోల వారిది, మే 23 తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఫలితం నిక్షిప్తమైపోయి వుంది.
ఇదిలా వుంటే, క్యాబినెట్ భేటీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా, మంత్రులందరితోనూ చంద్రబాబు ప్రత్యేకంగా మంతనాలు జరిపారట. క్యాబినెట్ భేటీకి మంత్రులంతా హాజరు కావాల్సిందేనని హుకూం జారీ చేశారట కూడా. ఏమో, ఇదే చంద్రబాబు అండ్ టీమ్కి చివరి క్యాబినెట్ సమావేశమవుతుందా.? మళ్ళీ చంద్రబాబే అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయా? వేచి చూడాలి.
126962 737300Thanks for helping out, superb info . 830320