Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల (Tirumala) లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం చేధించుకుని ఓ భక్తుడు శ్రీవారి ఆలయాన్ని కెమెరాలో బంధించాడు. సంపంగి ప్రాకారం నుంచి విమాన ప్రాకారం వరకూ వీడియో తీసి సోసల్ మీడియాలో షేర్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి ఆలయం వీడియోలు రావడంతో టీటీడీ (TTD) అలెర్ట్ అయింది. దీంతో టీటీడీ విజిలెన్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆలయ నియమ నిబంధనల ప్రకారం వెంకటేశ్వరుని సన్నిధిలోకి ఎలక్ట్రానికి పరికరాలు తీసుకెళ్లడం నిషేధం.
ఆదివారం రాత్రి ఓ భక్తుడు మొబైల్ తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు. రాత్రివేళ ఉరుములతో వర్షాలు పడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని.. ఆ సమయంలోనే భక్తుడు మొబైల్ తో ఆలయంలోకి ప్రవేశించి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ భద్రతాధికారి స్పందిస్తూ.. శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నా భక్తుడు ఇలా చేయడం విచారకరమన్నారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని.. భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.