Nagababu: తెలుగుదేశం పార్టీతో పొత్తు వుంటుందా.? వుండదా.? అది వేరే చర్చ.! జనసేన పార్టీ అయితే అధికారంలోకి రావడం ఖాయమట. జనసేన ఓటు బ్యాంకు గడచిన నాలుగేళ్ళలో గననీయంగా పెరిగిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు, జనంలోకి వెళుతున్నారు. జిల్లాల పర్యటనల్లో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా యలమంచిలికి వెళితే, అక్కడ జనసేన శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించిందాయనకు.
ఇప్పటిదాకా జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ మాత్రమే పార్టీ కీలక వ్యవహారాలు చూసుకునేవారు.. అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత. ఇప్పుడు నాగబాబు కూడా రంగంలోకి దూకారు. జనసేన అధినేత లేకుండా, ఓ జనసేన నేత నిర్వహించిన కార్యక్రమానికి జనం వేలాదిగా తరలి రావడం అనేది ఇదే తొలిసారి.. అని కూడా చెప్పొచ్చు.
ఇక, నాగబాబు తన పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి దాదాపు 7 శాతం ఓటు బ్యాంకు లభించిందనీ, అదిప్పుడు 35 శాతానికి పెరిగిందన్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.
జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోందనీ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవబోతున్నారనీ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి అది స్వర్ణయుగమేనని నాగబాబు చెప్పుకొచ్చారు. పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికల్ని దృష్టిపెట్టుకుని మరింత ఉత్సాహంగా పని చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.