ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉన్నతిని తట్టుకోలేకపోయాడు ఓ భర్త. ఆమె సంపాదనను జల్సాలకు ఖర్చు పెట్టింది చాలక.. తన స్నేహితుడి పేరుతో అశ్లీల వీడియోలు, మెసేజులు పంపిస్తూ మరింత డబ్బు లాగేశాడు. అనుమానంతో భార్య ఇచ్చిన సైబర్ కంప్లైంట్ తో భర్తే ఇదంతా చేసాడని తెలిసి కుమిలిపోతోంది.
గచ్చిబౌలికి చెందిన యువతికి కరీంనగర్ కు చెందిన సంతోష్ కుమార్ మాట్రిమోనియల్ లో పరిచయమయ్యాడు. పరిచయం స్నేహం, ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం భార్య ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లింది. భార్య ఉన్నతిని సహించలేక పోయాడు భర్త. అవసరమంటూ 63లక్షలు అడిగాడు. భర్త అడిగాడని డబ్బు పంపించింది భార్య. ఆ డబ్బునంతా జల్సాలకు ఖర్చు పెట్టేశాడు సంతోష్.
జల్సాలకు అలవాటు పడ్డ సంతోష్ మరింత డబ్బు పొందాలని కుయుక్తులు పన్నాడు. తన ఫ్రెండ్ సత్యహర్ష రెడ్డి పేరుతో భార్య మొబైల్, మెయిల్ కు అశ్లీల వీడియోలు, మెసేజులు పంపించి డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె కోటి రూపాయల వరకూ పంపించింది.
అనుమానం వచ్చిన యువతి గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్లో ఫిర్యాదు చేసింది. కేసును స్వీకరించిన పోలీసులు తమ విచారణలో ఈ వీడియోలు, మెసేజెస్ చేసింది భర్త సంతోష్ అని తేల్చారు. దీంతో సంతోష్ పై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు సంతోష్ ను అరెస్టు చేశారు.