దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా తన రూపాన్ని, శక్తిని మార్చుకున్న ఈ వైరస్.. ఇప్పుడు మరింత శక్తివంతమైందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ధూళిలో కూడా ఇది ఏకంగా నెల రోజుల వరకు మనుగడ సాగిస్తోందని గుర్తించారు. ఈ మహమ్మారి ఏ ఉపరితలంపై ఎంతసేపు మనుగడ సాగిస్తోందనే అంశంపై అమెరికాలోని ఒహయో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. స్థానికంగా కరోనా ఎలా వ్యాపిస్తుందో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని వ్యర్థ జలాలు, మురుగునీటిపై పరిశీలన చేశారు.
అలాగే కోవిడ్ బాధితులను ఉంచిన గదులపై కూడా పరిశోధనలు చేశారు. గదుల ఉపరితలంలోని ధూళి తదితరాల నమూనాలను సేకరించి పరిశీలించారు. ధూళి నమూనాల్లో 97 శాతం మేర, ఉపరితల నమూనాల్లో 55 శాతం మేర కరోనా మనుగడ సాధించగలుగుతోందని గుర్తించారు. దాదాపు నెల రోజుల వరకు కూడా ధూలిలో మనుగడ సాగిస్తోందని కనుగొన్నారు. ఇప్పటికే గాలి ద్వారా కూడా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్న తరుణంలో ఈ పరిశోధన ఫలితాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే.. కోవిడ్ బాధితుల్లోనే రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువనే విషయం కూడా పరిశోధనల్లో వెల్లడైంది.