కరోనా వైరస్ తీవ్రతను ముందస్తుగా అంచనా వేయడంలో మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది. ‘జ్వరం వస్తే వాడే పారాసిటమాల్ మందులు సరిపోతాయ్.. బ్లీచింగ్ పౌడర్ వేస్తే వైరస్ చనిపోతుంది..’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పాక, కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోందని ఎవరైనా ఎలా అనుకోగలం.?
ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు అధికార పార్టీ నేతలు ఇవే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడేమో కరోనా వైరస్ మీద వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా ‘యుద్ధం’ చేసేస్తోందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు వైసీపీ నేతలు. తెలంగాణ సహా దేశంలో ఇతర రాష్ట్రాల ఆలోచనలు ఇందుకు భిన్నంగా వున్నాయి. కరోనా వైరస్ని ‘మహమ్మారి’గా ముందే అనుమానించాయి. ‘పారాసిటమాల్’ వ్యాఖ్యల్ని తొలుత కేసీఆర్ కూడా చేసినా, వెంటనే ఆయన తన వ్యాఖ్యల్ని సవరించుకున్నారు. లాక్డౌన్ని అమలు చేయడం సహా అనేక విషయాల్లో కేంద్రం కంటే ముందుగా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
లాక్డౌన్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని తెలిసినా, ‘రెడ్, ఆరెంజ్, గ్రీన్’ జోన్లు అనీ, ఇంకోటనీ.. చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తుండడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా లేదు.. కొన్ని ప్రాంతాలకే అది పరిమితం..’ అని ప్రమాదాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేసిందన్నది నిర్వివాదాంశం.
ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు నానా రకాల పబ్లిసిటీ స్టంట్లూ చేసేశారు. ఫలితంగా, రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ చాలా వేగంగా పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో తీవ్రత తగ్గుతోందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడేమో, కృష్ణా జిల్లాలో పరిస్థితి చెయ్యిదాటుతోంది.
గుంటూరు జిల్లాలో స్వయంగా ఓ మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి.. కరోనా విస్తరణ విషయమై. సదరు మంత్రిగారి బంధువులే కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపణలు వస్తే.. అది రాజకీయ విమర్శ అని కొట్టి పారేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా వున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆరోపణలన్నీ నిజమని అనలేం. కానీ, ప్రభుత్వం ఆరోపణలు వచ్చినప్పుడు అప్రమత్తమైతే ఇప్పుడు ఈ దుస్థితి వుండేది కాదు. విపక్షాల సూచనల్ని రాజకీయ విమర్శలుగా కొట్టి పారేసి, రాష్ట్రాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టేయడమంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? ఇది కష్ట కాలం. ఎవరు ఏ సలహా ఇచ్చినా, విమర్శ చేసినా, ఆరోపణ చేసినా.. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
సత్వరం ఆయా అంశాలపై స్పందిస్తే.. రాష్ట్రానికీ మేలు జరుగుతుంది.. ప్రజలకూ ‘మహమ్మారి’ నుంచి ఉపశమనం దొరుకుతుంది.. ప్రభుత్వానికీ మంచి పేరొస్తుంది. కానీ, ఇలా ‘లెక్క’ తప్పే పరిస్థితులు వస్తే మాత్రం.. అది ఎవరికీ మంచిది కాదు.