ఒక్కో జిల్లా నుంచి ఒక్కర్ని మాత్రమే క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలుత భావించారట. తొలి విడత మంత్రి వర్గానికి సంబంధించి వైఎస్ జగన్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారనే ప్రచారం నేపథ్యంలో ‘ఆశావహులు’ అలర్ట్ అయ్యారు. వరుసగా ముఖ్యమంత్రితో భేటీలు షురూ చేశారు వారంతా. దాంతో, వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదని తెలుస్తోంది. మొత్తంగా 18 నుంచి 22 వరకు మంత్రుల సంఖ్యను పెంచాలని వైఎస్ కొత్త నిర్ణయం తీసుకున్నాగానీ, ఆశావహుల్లో ‘ఆందోళన’ చల్లారినట్లు కన్పించడంలేదు.
మొత్తం 151 మంది ఎమ్మెల్యేన్నారు అధికార పార్టీకి ప్రస్తుతం. మంత్రి వర్గంలో 25 మందికి అవకాశం కల్పించినా, ఒక్కో పోస్ట్ కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్సీల మాటేమిటి.? చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించకపోయినా, వైఎస్ జగన్ వెంట గత పదేళ్ళుగా నడుస్తున్నవారి సంగతేంటి? ఎలా చూసుకున్నా, మంత్రి వర్గ కూర్పు అంత ఈజీ కాదు. ఆయా జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు మంత్రి పదవులు తమనే వరిస్తున్నాయంటూ లీకులు పంపించేసుకుంటున్నారు. దాంతో, మీడియాలో ఫలానా ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నారట, ఫలానా ఎమ్మెల్సీకి మంత్రిగా అవకాశం దక్కుతుందట, ఫలానా ముఖ్య నేతకు ఫలానా మంత్రిత్వ శాఖ ఖాయమైందట అంటూ కథనాలు వెల్లువెత్తడం వెనుక కూడా పెద్ద కథే నడుస్తోంది.
సదరు నేతలే మీడియాకి లీకులు ఇవ్వడం వల్ల, మీడియాలో కథనాలు షురూ అవడం వల్ల, అధినేతపై ఒత్తిడి పెరుగుతుందనీ, తద్వారా తమ అవకాశాలు పెరుగుతాయనీ సదరు నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యంగా వైఎస్సార్సీపీ వేవ్ కనిపించింది. దాంతో అక్కడి ప్రజా ప్రతినిథులు అత్యంత కీలక పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తన సొంత ప్రాంతం రాయలసీమకు పెద్ద పీట వేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారనే ఆవేదన కోస్తా ప్రాంత నేతల్లో వెల్లువెత్తుతోంది. గెలవడం ఓ ఎత్తు, గెలిచాక మంత్రి పదవుల పంపిణీ ఓ ఎత్తు.
ఇంతటి భారీ విక్టరీ సాధించాక ఆశావహులు పెరిగాక, అసంతృప్తుల్ని బుజ్జగించడం అంత తేలిక కాదు. నామినేటెడ్ పదవుల పేరుతో కొంతమందిని ఇప్పటికే బుజ్జగించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఉత్తరాంధ్రకు చెందిన కొందరు నేతల్ని వైఎస్ జగన్ బుజ్జగించినా, ‘ఇలాంటి దుస్థితి వస్తుందని అస్సలూహించలేదు’ అంటూ ఓ ముఖ్య నేత, తన అసహనాన్ని మీడియాకి లీకుల ద్వారా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంతటి గందరగోళం నడుమ వైఎస్ జగన్, ఎవరెవరికి తీపి కబురు అందిస్తారో, ఎవరికి చేదు వార్త అందిస్తారో వేచి చూడాల్సిందే.
114141 566340I was trying to uncover this. Truly refreshing take on the data. Thanks a whole lot. 818715