Chiranjeevi: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాలలో కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని పద్మవిభూషణ్ (Padma Vibhushan) తో గౌరవించింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణాన ఏం మాట్లాడాలో.. ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మవిభూషణ్’ లభించినందుకు సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను తమ సొంత మనిషిగా.. మీ అన్నయ్యగా.. మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు.. నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతి నిముషం నడిచే లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను’.
‘నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ.. నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకు వస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. నన్ను ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్’ అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.
🙏🙏🙏 pic.twitter.com/QAfqE5Rk1G
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024