‘అలిపిరి ఘటనలో మైన్స్కు భయపడని నేను.. గులకరాళ్లకు భయపడతానా.? నేను తలచుకుంటే ఒక్కరన్నా బయటకు వచ్చేవాళ్లా? నవరత్నాలు కావవి.. నవ మోసాలు కాబట్టే ఈ రౌడీయిజం. రౌడీల తోకలు కట్ చేస్తాం’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
‘నగరాభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగింది. తిరుపతి టీడీపీకి కంచుకోట. తిరుపతి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు, రెండేళ్ల వైసీపీ పాలనలో ఇక్కడ తట్ట మట్టి కూడా వేయలేదు. తెలుగు గంగ నీళ్లు తెచ్చాం. కొండపైకి నీళ్లు తీసుకెళ్లాం. కండలేరు ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేశాం. తిరుమల పవిత్రతను కాపాడాం. ఎన్టీఆర్తో పాటు నేను, పార్టీ నాయకులెవరు తిరుపతి వచ్చినా… పవిత్ర భావంతో స్వామివారి దర్శనం చేసుకునే వాళ్లం. మహిళా యూనివర్సిటీ నుంచి ఐఐటీ వరకు అన్నీ టీడీపీ తీసుకువచ్చినవే. అభివృద్ధి చేతకాని మనుషులు పరిపాలన చేస్తున్నారు’ అని మండిపడ్డారు.