YS Avinash Reddy: అన్ని కేసుల్లోనూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరికీ ఇలాంటి వెసులుబాట్లు వుంటాయా.? కొందరికి మాత్రమే, ప్రేమ లేఖల తరహాలో ‘విజ్ఞప్తి లేఖలు’, ‘వాయిదా లేఖలు’ రాసుకునే అవకాశాన్ని దర్యాప్తు సంస్థలు కల్పిస్తాయా.? ఇదో మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మారింది.! దేశవ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశమవుతోంది.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతోపాటు, సాక్ష్యాల్ని మాయం చేశారంటూ అవినాశ్ రెడ్డి మీద అభియోగాలు మోపబడుతుండడం చూస్తున్నాం.
ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి ప్రయత్నించారంటేనే, అక్కడ మేటర్ చాలా సీరియస్ అని. ‘బెయిల్ ఇవ్వొద్దు’ అని సీబీఐ వాదించిందంటే, ఆయన్ని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్రయత్నించి వుండాలి కూడా. కానీ, చిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
విచారణకు హాజరు కావాలని సీబీఐ పిలవడం, తనకు తీరిక వున్నప్పుడు విచారణకు హాజరవుతానని అవినాశ్ రెడ్డి లేఖలు పంపడం, దానికి సీబీఐ అనుమతించడం.. అంతా తేడా వ్యవహారంలా కనిపిస్తోంది. చిన్న చిన్న కేసులు.. అంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, రాత్రికి రాత్రి అరెస్టు చేసి తీసుకెళ్ళిపోతున్నారు పోలీసులు.
అలాంటిది, హత్య కేసు ఇది. అవినాశ్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం వుందా.? లేదా.? అన్నది పూర్తి విచారణలో తేలొచ్చుగాక. కానీ, ఆయనైతే తీవ్రమైన నేరాభియోగాల్ని ఎదుర్కొంటున్నారు కదా.? అలాంటి అవినాశ్ రెడ్డికి సీబీఐ ఇంతలా ఎందుకు వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు.? అయినా, ఈ ప్రేమ లేఖల గోలేంటి.?