ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ లేకుండా, ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేది ఎలా.? ఓ వైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్.. పలు రాజకీయ కార్యకలాపాలతో జనంలో వుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు, జనసేన పార్టీ పరిస్థితి వేరు.! టీడీపీ – జనసేన పొత్తు ఖరారైంది. అలాగే బీజేపీ – జనసేన పొత్తులో వున్నాయి. బీజేపీని, టీడీపీతో కలపడం అనే బాధ్యత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదుంది.
ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో ఏదో ఒకటి తేల్చేసుకుని, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ అయిపోవాల్సి వుంది. కానీ, జనసేన అధినేత అలా చేయలేకపోతున్నారు. బీజేపీ, తమ కూటమిలోకి వస్తుందో రాదో అన్న విషయమై జనసేన అధినేతకు కొన్ని అనుమానాలున్నాయి.
మరోపక్క, పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి.? పార్టీలో ఎవర్ని ఏ రకంగా బుజ్జగించాలి.? అన్నదానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
‘వారాహి యాత్ర’ను మళ్ళీ ప్రారంభించేసి, ఈ సమావేశాలు అప్పుడప్పుడూ జరుపుకోవచ్చు కదా.? అంటే, దానికి మళ్ళీ వేరే లెక్కలున్నాయి. అందుబాటులో వున్న వనరులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాల్ని జనసేనాని రచించాల్సి వుంటుంది. అదే అసలు సమస్య.
కార్యకర్తలు, అభిమానులు నిజాయితీతో ఇచ్చే విరాళాలు, అంతే నిజాయితీతో నాయకులు ఇచ్చే విరాళాలకు తోడు, తన తరఫున పార్టీకి అందించే ఆర్థిక సాయం విషయంలో జనసేనాని బాధ్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలా ఒకటా.? రెండా.? సవాలక్ష పనులున్నాయ్. కానీ, సమయం మించిపోతోంది. ముఖ్య నాయకులకైనా పోటీ చేసే నియోజకవర్గాలపై స్పష్టత ఇస్తే, గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టేసుకుంటారు కదా.?
బీజేపీ కోసం జరుగుతున్న ఈ ఆలస్యం టీడీపీ – జనసేన కూటమి కొంప మునిగేలా వుండకూడదు.