జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. మిత్రపక్షాలే గనుక, ఈ తరహా భేటీల వెనుక వింతేముంటుంది.? అన్నది సర్వసాధారణంగానే తెరపైకొచ్చేవాదన.
కానీ, తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ గ్యాప్ వుంది. అది కూడా, బీజేపీ వైపు నుంచే. గ్రేటర్ ఎన్నికల సమయంలో, జనసేన పార్టీ అవసరం తమకు లేదన్నట్టుగా కొందరు బీజేపీ నేతలు వ్యవహరించారు.
అప్పట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వున్న బండి సంజయ్ కూడా కొంత మేర అతి చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, జనసేన పార్టీ ఇవ్వాల్సిన స్థాయిలోనే బీజేపీకి షాక్ ఇచ్చింది.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందే జాగ్రత్త పడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయికపై అధికార బీఆర్ఎస్ నుంచి కొంత అభ్యంతరం వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే సంగతి.
తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన ఇప్పటికే నిర్ణయించుకుంది. దాంతో, తెలంగాణ బీజేపీ ఒకింత ఆందోళన చెందింది. జనసేనానితో భేటీ సమయంలో ఈ 32 నియోజకవర్గాల విషయమై చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. జనసేనానితో భేటీ అనంతరం, జాతీయ నాయకత్వంతో తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భేటీ అవుతుండడం గమనార్హం.
బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తే, తెలంగాణలో ఖచ్చితంగా ఈక్వేషన్స్ ఒకింత ఇంట్రెస్టింగ్గా మారతాయి. టీడీపీ ఎలాగూ ఈ కూటమికి మద్దతిచ్చే అవకాశం వుంటుంది, ఇదే ఈక్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇంకాస్త బలంగా అప్లయ్ అయ్యేందుకూ మార్గం సుగమం అవుతుంది.
మొత్తమ్మీద, జనసేనతో కలిసి ప్రయాణించే విషయంలో గతంలో మొండికేసిన తెలంగాణ బీజేపీ, ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చిందని అనుకోవచ్చన్నమాట.