టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన రాయుడు ఆరు రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా బుధవారం జనసేనానితో భేటీ అవ్వడంతో మరోసారి రాయుడు వార్తల్లో నిలిచాడు. సమావేశం వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ స్వచ్ఛమైన ఆలోచనలతో, మనసుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. నా విజన్ కి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో వైసీపీలో చేరాను. క్షేత్రస్థాయిలో ఎన్నో గ్రామాల్లో పర్యటించాక అక్కడ సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ఆ పార్టీతో చేతులు కలిపాను. అయితే ఆ పార్టీ ఐడియాలజీ నా ఆలోచనలకి భిన్నంగా ఉంది. దీంతో ఆ పార్టీకి నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ తో చర్చించమని నా శ్రేయోభిలాషులు నాకు సూచించారు. ఆయనతో సమావేశమై చాలాసేపు వ్యక్తిగత విషయాలు రాజకీయాల గురించి చర్చించుకున్నాం. ఆయన ఐడియాలజీ నా ఆలోచనలకు చాలా దగ్గరగా ఉండడం ఆనందంగా ఉంది. క్రికెట్ టోర్నమెంట్ కోసం దుబాయ్ వెళుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
— ATR (@RayuduAmbati) January 10, 2024