ఇండియాలో కరోనా వ్యాప్తి భయంకరంగా ఉంది. ప్రపంచంలో అమెరికా అత్యధిక పాజిటివ్ కేసులను కలిగి ఉంది. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తూ ఉంటే త్వరలోనే అమెరికాను ఇండియా దాటేనా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒక్కరికి సోకిన వైరస్ కొన్ని వందల మందికి వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క వ్యక్తి నుండి ఏకంగా 222 మందికి సోకడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రజలు ఎంత చైతన్యంగా ఉన్నా కూడా వైరస్ దాడి మాత్రం విపరీతంగా ఉంది.
తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో గత నెల 21న ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఆ కేసు నమోదు అయిన వారం పది రోజుల్లోనే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య పదుల సంఖ్యలో పెరిగింది. ప్రస్తుతం మామిడాడ గ్రామంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 125 కు చేరింది. మామిడాడ గ్రామస్తుల కాంటాక్ట్ ద్వారా సూర్యరావుపేటలో 57 మందికి కూడా పాజిటివ్ అయ్యింది. మొత్తంగా మామిడాడ గ్రామంకు చెందిన ఆ ఒక్క కేసు కారణంగా మొత్తం 222 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ఎన్ని లక్షలకు ఈ కేసులు వెళ్తాయో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతోంది.