మొన్నటిదాకా ఆమె వైఎస్ షర్మిల రెడ్డి ఇప్పుడేమో మొరుసుపల్లి షర్మిల శాస్త్రి.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైత్యానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? తోడబుట్టిన చెల్లెలి విషయంలో ఇంత జుగుప్సాకరంగా ఏ అన్న అయినా ప్రవర్తించగలరా.? ఛాన్సే లేదు.! అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే సొంతమైన రాజకీయం.!
ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. స్వయానా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల.! పైకి నేరుగా ఈ మాటలు ఆమె చెప్పలేకపోతున్నా, ఆమె మాటల్లో అర్థం ముమ్మాటికీ ఇదే. ముందు ముందు ఇంకాస్త స్పష్టంగా అన్ని విషయాల్నీ వైఎస్ షర్మిల వెల్లడించేలానే వున్నారు.
‘కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెట్టింది..’ అని నాలుగున్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వం తరఫున నిర్వహించిన కాన్క్లేవ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చేసిన రాజకీయ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
‘వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు. జగన్ అన్నగారే ఆ ఘనకార్యం చేసింది. సాక్ష్యం ఎవరో కాదు మా అమ్మ విజయమ్మ.. మా కుటుంబం కూడా సాక్ష్యంగానే వుంది ఆ ఘనకార్యానికి. ఆ దేవుడు కూడా సాక్షి..’ అంటూ వైఎస్ షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చాలా చిత్రమైన విషయం కదా ఇది.! ఒకప్పుడు వైసీపీ కోసం వైఎస్ షర్మిల ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019 ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల, తన చేతి వేలికి వున్న వుంగరాన్ని కోల్పోయారు.. నిబద్ధత కలిగిన వైసీపీ కార్యకర్తల చోర కళ ఫలితం అది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల.. అదీ తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసమే. ఇంతా చేసి వైఎస్ షర్మిలకి పార్టీలోనో, ప్రభుత్వంలోనో ఓ పదవి కూడా ఇచ్చుకోలేకపోయారు వైఎస్ జగన్. మండుతుంది మరి షర్మిలకి.! ‘ఏం అన్యాయం చేశామో చెప్పాలి..’ అంటూ షర్మిలకి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.
వైసీపీకి షర్మిల ఏం చేశారు.? సజ్జల ఏం చేశారు.? సజ్జలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ‘సకల శాఖల’ పదవులు ఇచ్చుకున్న వైఎస్ జగన్, షర్మిలను ఎందుకు నిర్లక్ష్యం చేశారో.! వస్తాయ్.. అన్ని లెక్కలూ వస్తాయ్.! ఎక్కువ రోజులు ఆగాల్సిన పనే లేదు. షర్మిల అన్ని విషయాల్నీ వెల్లడించేసేలానే వున్నారు.