బర్రెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా దత్త పుత్రుడికి రాలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైరేసేశారు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా.
కార్యక్రమం, ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించింది. మాట్లాడిందేమో, తెలంగాణ రాజకీయాల గురించి. బర్రెలక్క ఎవరో తెలుసు కదా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సాధారణ యువతి. ఆమెకు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా మద్దతు పలికారు.
ఆమెకు దాదాపు 5 వేల ఓట్లు వచ్చాయి, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. జనసేన పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఓట్లు వచ్చాయ్. మిగతా చోట్ల (ఏడు చోట్ల) చాలా తక్కువ ఓట్లు వచ్చిన మాట వాస్తవం.
ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి.? గతంలో, అంటే 2014 ఎన్నికల సమయంలో వైసీపీకి, ఇదే కొల్లాపూర్ నియోజకవర్గంలో 1500 ఓట్లు కూడా రాలేదు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రస్తావిస్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తోంది.
అంతే కాదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన పిరికిపందకి, తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడన్నది జనసేన నేతల ప్రశ్న. అంతే కాదు, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
వైఎస్ జగన్ కంటే, షర్మిలక్క కంటే కూడా బర్రెలక్క బెటర్ కదా.. అన్నది జనసేన వాదన.! ఇవే, ఇలాంటి విమర్శలు వస్తాయి గనుక.. వైసీపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో, వాళ్ళు కొంత సోయతో వుండాలి మరి.!
ఎవరో ఏదో రాసిస్తారు.. దానికి విపరీతమైన యాక్టింగ్ని జోడించేసి, చదివేస్తుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అన్నట్టు, ఉద్దానం అని పలకడానికి బదులు ఉద్యానం.. అని పలికారు వైఎస్ జగన్. ఈయన మళ్ళీ రాజకీయ ప్రత్యర్థుల మీద సెటైర్లేయడం.!