సినీ నటి, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అప్పుడప్పుడూ రాజకీయ తెరపై కన్పిస్తుంటారు. ఒకప్పుడు బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి, తెలంగాణ కోసమంటూ తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి, కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ‘దేవుడిచ్చిన చెల్లి’గా మారిన విషయం విదితమే. అలా ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి నుంచే మెదక్ ఎంపీగా విజయం సాధించి.. రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
అయితే, నిలకడలేని మనస్తత్వం కారణంగా, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇమడలేకపోయిన విజయశాంతి, కీలకమైన సమయంలో టీఆర్ఎస్ని వీడి, కాంగ్రెస్లో చేరారు. ఆ నిర్ణయం ఆమె తీసుకోకపోయి వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికీ ఆమె కీలక నేతగా వుండి వుండేవారే. ఏమో, అదృష్టం కలిసొచ్చి విజయశాంతి మంత్రిగానూ అవకాశం దక్కించుకుని వుండేవారేమో. అయినా, ఎవరి దురదృష్టానికి ఎవరు బాధ్యులు.? ఇప్పుడామె రోడ్లపైకెక్కి, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా నినదించాల్సి వస్తోంది.
‘మీడియా, కేసీఆర్ చెప్పు చేతల్లో వుంది. ప్రజల ఆవేదనను మీడియా పట్టించుకోవడంలేదు. ప్రజా ఉద్యమాల్ని కేసీఆర్ ప్రభుత్వం అణగదొక్కేస్తోంది. మీడియా సైతం కేసీఆర్ బెదిరింపులకు తలొగ్గుతోంది..’ అంటూ విజయశాంతి ఒకింత అక్కసుని మీడియా మీద కూడా వెళ్ళగక్కారు తాజాగా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల రచ్చ నేపథ్యంలో విజయశాంతి, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో, విజయశాంతి చేసిన యాగీ అంతా ఇంతా కాదు.
వాస్తవానికి, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే విజయశాంతి హంగామా ఇంకోసారి కొత్తగా మొదలైంది. అయితే, ఆ ఎన్నికల్లో విజయశాంతిని కాంగ్రెస్ నేతలే సీరియస్గా తీసుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చి, టిక్కెట్ దక్కించుకోగలిగి వుంటే.. పార్టీలో విజయశాంతికి కొద్దో గొప్పో గౌరవం లభించి వుండేది. కానీ, ఆమె అలా చేయలేదు. పోనీ, లోక్సభ ఎన్నికల్లో అయినా విజయశాంతి పోటీ చేసేందుకు ప్రయత్నించారా? అంటే అదీ లేదు.
‘నేను పెద్ద స్టార్ని’ అనే అహంకారం విజయశాంతిలో ఇంకా పోలేదని ఆమె గురించి చాలా అభిప్రాయాలే వున్నాయి. రాజకీయాల్లోనూ తానొక పెద్ద నేతననే గర్వమే విజయశాంతిని రాజకీయాల్లోనూ ఎదగనీయకుండా చేస్తోందనేవారూ లేకపోలేదు. కొన్ని విషయాల్లో విజయశాంతి వాదనలు సూటిగానే కన్పిస్తాయి. కేసీఆర్ని ప్రశ్నించే విషయంలో విజయశాంతి స్పష్టతతోనే వుంటారు. కానీ, పార్టీలో ముఖ్య నేతగా పార్టీ శ్రేణుల్ని కూడదీసి, పార్టీని బలోపేతం చేయడంలో మాత్రం ఆమె విఫలమవుతూ వస్తున్నారు.
విజయశాంతి ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా వుంటారో, ఎప్పుడామె రాజకీయంగా మౌనం దాల్చుతారో ఎవరికీ తెలియదు. పైగా, ‘అలక’ ఆమెకు అతి పెద్ద మైనస్ పాయింట్. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోతే సింపుల్గా సైలెంటయిపోతారు.. ఆ అలక వీడటానికి ఆమె ఎక్కువ సమయమే తీసుకుంటారు. రాజకీయమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బోల్డంత స్టార్డమ్ సంపాదించారు విజయశాంతి సినీ నటిగా.. దాన్ని ఆమె రాజకీయాల్లో సద్వినియోగం చేసుకోవాల్సి వుంది.
ఇదిలా వుంటే, విజయశాంతి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అదీ మహేష్బాబు హీరోగా తెరక్కెనున్న కొత్త సినిమాలో. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే విజయశాంతి నుంచి ఇంతవరకు సినీ రంగంలోకి రీ-ఎంట్రీ విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు.
