జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని నిలిపిన జనసేన పార్టీ, త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల కోసం గ్లాసు గుర్తుతోపాటు, బ్యాట్ గుర్తుని కూడా జనసేన ప్రచారంలోకి తెచ్చింది. ప్రత్యేక కారణాలతో రెండు గుర్తులతో జనసేన, ఈ ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోంది. జనసేన తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని జనసైనికులు ధీమాగా చెబుతున్నారు.
ఇదిలా వుంటే, జనసేన పార్టీకి చెందిన యూత్ వింగ్ ‘జనసేన స్టూడెంట్స్ యూత్’ వింగ్ కార్యకర్తలు, తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై గళం విప్పారు, ఉద్యమబాట పట్టారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామంటూ ఈ రోజు హైద్రాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారు. ప్రధానంగా హైద్రాబాద్ వేదికగా జనసైనికులు పోరుబాట పట్టడంతో అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టినట్లుగానే కన్పిస్తోంది.
ఇంటర్ ఫలితాల విషయమై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించాలనీ, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలనీ, ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాట్లు కల్పించాలనీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశాకే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మౌనం వీడారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ ఉచితమంటూ ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు, త్వరలో జరిగే పోటీ పరీక్షలకు ఇబ్బందుల్లేకుండా చూడాలనీ కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు.
అయినప్పటికీ కూడా విద్యార్థి లోకంలో ఆందోళన తగ్గలేదు. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతోందంటూ ఆందోళన చెందుతున్నారు. జనసేన పార్టీని ట్యాగ్ చేస్తూ విద్యార్థులు, తమ తరఫున నిలబడాలని జనసేన పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ విద్యార్థుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేసింది. ప్రభుత్వం కళ్ళు తెరిచేదాకా ఉద్యమం కొనసాగుతుందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో.. జనసైనికులు కదం తొక్కుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఎన్నికల కోసమే రాజకీయాలు కాదు, రాజకీయం అంటే ప్రజల కోసమని జనసేన పార్టీ తన తాజా కార్యాచరణతో స్పష్టం చేసింది. ముందు ముందు జనసేన చేపట్టబోయే కార్యక్రమాలు మరింత ఉధృతంగా వుంటాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. విద్యార్థులే దేశానికి అతి పెద్ద ఆస్థి అనీ, అలాంటి విద్యార్థుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. చిన్న నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలు తీసేస్తున్న దరిమిలా, అలాంటి నిర్లక్ష్యానికి ఆస్కారమిచ్చినవారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు జనసైనికులు.
తెలంగాణ రాష్ట్రం లో జన సేన పార్టీ ఉనికే లేదంటూ నిన్న మొన్నటిదాకా విమర్శలు చేసినోళ్ళు కూడా ఇప్పుడు జన సైనికుల ఉత్సాహం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. జనసైనికుల ప్రభంజనం ముందు ముందు పెను సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. జనసేనాని ప్రత్యక్షంగా విద్యార్థులతో మమేకమయ్యేందుకోసం సన్నద్ధమవుతున్నారన్న ఊహాగానాలే నిజమైతే, ఆ తర్వాతి ప్రభంజనం ఊహలకందనిదే అవుతుంది.
