రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం. విజయనగరంలో బొత్స, శ్రీకాకుళంలో ధర్మాన.. ఈ పేర్లు, ‘బ్రాండ్’ తరహాలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి.
చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, అసెంబ్లీకి పోటీ చేస్తుండగా, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. చీపురుపల్లి మామూలుగా అయితే, బొత్స సత్యనారాయణకి వన్ సైడ్ ఓటింగ్ అన్నట్లుగా వుంటుంది. కానీ, ఈసారి లెక్కలు మారేలా వున్నాయి. చివరి వరకు టఫ్ ఫైట్ వుంటుందని అంటున్నారు.
చీపురుపల్లి ఇంపాక్ట్, దాదాపుగా విజయనగరం జిల్లా అంతా వుంటుందన్నది ప్రముఖంగా వినిపించేమాట. చాలా నియోజకవర్గాలపై బొత్స అండ్ ఫ్యామిలీ ప్రభావం ఆ స్థాయిలో వుంటుంది మరి. జిల్లాపై తన ఆధిపత్యాన్ని బొత్స ఈసారి నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. ఎక్కడికి వెళ్ళినా, ‘కూటమి వస్తుందట కదా..’ అన్న వాదన, పోలింగ్ తర్వాత కనిపిస్తోంది.
ఇక, శ్రీకాకుళం పరిస్థితి కూడా దాదాపుగా అంతే. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీకి పోటీ చేస్తుండగా, ఆయనకి కూటమి వైపు నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. శ్రీకాకుళం లోక్ సభ పరిధిలో సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభావం చాలా గట్టిగా వుండబోతోంది.
మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లాలో టీడీపీ గెలుపుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కుల సమీకరణాలు.. వంటి వాటిని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ‘కో-ఆర్డినేట్’ చేసిన విధానం, జిల్లా మొత్తమ్మీద, టీడీపీకి ఎడ్జ్ వచ్చేలా చేస్తోంది.
అటు ఇచ్చాపురం నుంచి, ఇటు అనకాపల్లి వరకు, ఏ నియోజకవర్గంలో చూసుకున్నా, ‘కూటమి గెలుస్తుందట కదా..’ అన్న అభిప్రాయమే సాధారణ ఓటర్ల నుంచి వస్తోంది. సంక్షేమ పథకాలు బాగానే అందున్నా, అభివృద్ధి లేకపోవడం ఓటర్ల నుంచి వైసీపీకి తిరస్కరణ ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధానంగా రోడ్లపై గుంతల వ్యవహారం, వైసీపీకి గ్రౌండ్ లెవల్లో చాలా వ్యతిరేకతను మూటగట్టింది. ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి నాడు – నేడు అనేది కేవలం పత్రికల్లో ప్రకటనలకు పరిమితమవడం, గ్రామ పచివాలయాల పేరుతో చేసిన అభివృద్ధీ పెద్దగా లేకపోవడం.. వీటిని జనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సంగతి ఇలా వుంటే, విశాఖ రాజధాని అంశం తాలూకు ప్రభావం, ఉత్తరాంధ్రలో ఎక్కడా కనిపించడంలేదు. ‘కొత్తగా విశాఖలో చేసే అభివృద్ధి ఏముంటుంది.? దోచుకోవడం తప్ప..’ అన్న చర్చ ప్రజల్లో కనిపిస్తోంది. ‘రాజధాని దగ్గరగా వుంటే మంచిదే.. కానీ, అందరికీ అందుబాటులో.. రాష్ట్రానికి మధ్యలో వుంటే ఇంకా మంచిది..’ అని అమరావతి పట్ల సానుకూలంగానే వుంది ఉత్తరాంధ్రలో. అమరావతి రైతులకు అన్యాయం జరిగిందన్న భావన కూడా ఉత్తరాంధ్రలో వ్యక్తమవుతోంది.
ఆసక్తికరమైన విషయమేంటంటే, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి, కూటమి అభ్యర్థి..’ అన్న ప్రస్తావనే వినిపిస్తోంది. ‘సైకిల్, గ్లాస్, కమలం..’ ఈ మూడు గుర్తులకు సంబంధించి ఓటర్లకు స్పష్టమైన అవగాహన వున్నట్లే కనిపిస్తోంది. ‘కూటమి గెలిస్తే.. అందులో పవన్ కళ్యాణ్ వాటా చాలా ఎక్కువ..’ అని యువత మాత్రమే కాదు, మహిళలు, వృద్ధులు కూడా చెబుతుండడం గమనార్హం.
‘గతంలోనే జనసేన గెలిచి వుండాల్సింది..’ అనే అభిప్రాయాన్ని చాలామంది ఓటర్లు వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన ఇంకొన్ని స్థానాల్లో పోటీ చేసి వుంటే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.