బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏపీ తీరానికి దూరంగా ఈశాన్య దిశగా పయనిస్తూ గురువారం బలపడింది. ఈ ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
శనివారం ఉదయానికి తూర్పు బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడనుంది.
ఈ ప్రభావంతో ఆది, సోమవారాల్లో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, త్రిపుర, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అయితే ఈ ప్రభావం రాష్ట్రంలో అంతగా లేనందున భారీ వర్షాలకు అవకాశం లేదని చెప్పింది. మరోవైపు అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ ప్రభావం వల్ల కర్ణాటక లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.