వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం- జనసేన పార్టీలు జోరు పెంచాయి. ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ‘షణ్ముఖ వ్యూహం’ పేరుతో ప్రజల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం. ‘షణ్ముఖ వ్యూహం’లో భాగంగా పవన్ ఆరు అంశాలను చంద్రబాబుకి సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో అమరావతిని రాజధానిగా కొనసాగించడం, ఏటా లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, చిరు వ్యాపారులకు 10 లక్షల సాయం, ప్రణాళికతో కూడిన ఉద్యోగాల కల్పన, చిన్న పరిశ్రమలకు చేయూత, సంపన్న ఏపీ పథకం పేరుతో వివిధ రంగాలకు ఆర్థిక సాయం అందించే అంశాలను పవన్ ప్రతిపాదించినట్లు సమాచారం.
అధికార వైసీపీ పార్టీని తమ ‘షణ్ముఖ వ్యూహం’తో పడగొడతామని గతంలో పలుమార్లు పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలుగుదేశం కూడా ఇటీవలే ‘సూపర్ సిక్స్’ పేరుతో మినీ మేనిఫెస్టో అని విడుదల చేసింది.