తెలుగుదేశం పార్టీతో జనసేన కలిస్తే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో స్వీప్ చేసెయ్యొచ్చు.. అధికార వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.! గత కొన్నాళ్ళుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతూ వచ్చిన చర్చ.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయ్యాక, ఈ అభిప్రాయంలో స్వల్ప తేడా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ‘వారాహి విజయ యాత్ర’తోనే ఈక్వేషన్ మారిపోయింది.
‘జనసేన పార్టీతో టీడీపీ కలిస్తే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేస్తుంది..’ అనే మాట ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో, టీడీపీనే ఒకింత మెట్టు దిగక తప్పదనే అభిప్రాయం బలంగా సామాన్యుల నుంచి తెరపైకొస్తోంది.
సరే, సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినాయకత్వాలు ఒక చోట కూర్చున్నాక, బలాబలాల అంచనా నేపథ్యంలో, ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్నది తేలుతుందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, గ్రౌండ్ రియాల్టీ చూసుకుంటే మాత్రం, టీడీపీ కంటే కూడా జనసేన పార్టీకే ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అడ్వాంటేజ్ కనిపిస్తోంది.
‘టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాల లొల్లి ఏమాత్రం జరిగినా, అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది..’ అన్నది మెజార్టీ అభిప్రాయం. అందుకే, ఆ అభిప్రాయ బేధాలు తలెత్తకుండా, కింది స్థాయిలో ఇరు పార్టీలకు చెందిన నేతలు కలిసిపనిచేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
వివిధ పండుగల నేపథ్యంలో, రెండు పార్టీలకు చెందిన నాయకులూ ఖచ్చితమైన అవగాహనతో బ్యానర్లు పెడుతున్నారు. క్యాడర్లను కలుపుకుపోయేలా కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజానికి, ఈ మార్పు అనూహ్యం. ‘అస్సలు కలిసి పని చేయలేం..’ అన్న వాదన నుంచి, ‘కలిసి పని చేస్తాం..’ అనే బలమైన సంకేతం, అది కూడా టీడీపీ నుంచి రావడం విశేషమే మరి.!