Karnataka: ‘మిస్టర్ కె’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు గురించే చర్చ. ఎవరీ ‘మిస్టర్ కె’?. అర్థంతరంగా ఆయన పేరు ఇప్పుడు ఎందుకు తెరమీదకి వచ్చినట్టు? కర్ణాటక లో కాంగ్రెస్ విజయ వెనక ఈయన ప్రమేయం ఏంటి? అని సర్వత్రా చర్చ నడుస్తోంది. సునీల్ కనుగోలు( Sunil Kanugolu).. తెలుగు మూలాలున్న వ్యక్తి. కర్ణాటకలోని బళ్ళారి లో పుట్టారు. చదువు నిమిత్తం చెన్నై లో స్థిరపడ్డారు. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే కొన్నాళ్లపాటు ఉన్నారు. తర్వాత ఇండియాకి వచ్చి గుజరాత్ ఎన్నికల వ్యూహాల్లో చురుగ్గా పనిచేశారు.2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) టీం లో ఈయన ఒక మెంబర్. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీ సంపాదించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత సునీల్ ఉత్తర ప్రదేశ్ బీజేపీ కి రాజకీయ వ్యూహకర్త గా పనిచేశారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ విజయ ఢంకా మోగించింది. 2019 లో స్టాలిన్ పార్టీతో జతకట్టి డిఎంకె పార్టీ 38 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో సునీల్ పేరు దక్షిణాదిన మారుమోగింది.
ఇక సొంత రాష్ట్రం కర్ణాటకలో కొద్దిరోజులపాటు బీజేపీతో కలిసిన సునీల్ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లోకి మకాం మార్చారు. గతేడాది ఆ రాష్ట్ర పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీ సునీల్ ని ఆహ్వానించినా అటువైపు వెళ్ళలేదు. గతేడాది నుంచి కాంగ్రెస్ ను ఎన్నికలకు సునీల్ సిద్ధం చేశారు. తనదైన వ్యూహాలు రచిస్తూ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను పోగొట్టారు. పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్( DK Shivakumar), ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య లను ఏకం చేసి తన వ్యూహాలను అప్లై చేశారు. బీజేపీ ప్రభుత్వంలోని లోటుపాటులే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్లాన్ చేశారు. బొమ్మై ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటుందంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ‘పేసీఎం’ అంటూ ప్రచారం లో బొమ్మై ని కాంగ్రెస్ విమర్శించడం మొదలుపెట్టింది.
బీజేపీ ప్రభుత్వం కన్నడ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా సామాన్య ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో గృహలక్ష్మి, ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత రవాణా వంటి అంశాలను చేర్చడం కూడా సునీల్ వ్యూహంలో భాగమే. ఈ రకంగా కాంగ్రెస్ పేద ప్రజలను ఆకర్షించింది. పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడం కూడా ఆషామాషీగా జరగలేదు. కార్యకర్తలందరి గురించి సునీల్ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న విషయంపై సర్వే చేశారు. ప్రజాదరణ దక్కించుకున్న నేతలకే టికెట్లు ఇచ్చారు. ఆయన వ్యూహం అధ్యయనం ఫలించి కన్నడ నాట కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుంది. ఆయన వ్యూహాలను నచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేయడానికి లోక్ సభ ఎలక్షన్స్ టాస్క్ ఫోర్స్ టీం లో ఆయన్ని సభ్యున్ని చేశారు.