టాయిలెట్స్ విషయంలో ఇప్పటివరకూ ట్రాన్స్జెండర్స్కు ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. వారికోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ఈ టాయిలెట్లను నిర్మించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో రూ.5 లక్షల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ టాయిలెట్లను గురువారం వారణాసి మేయర్ మృదుల జైస్వాల్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోనే ఇది మొదటి ట్రాన్స్జెండర్ టాయిలెట్ అని అన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాన్స్జెండర్స్ కోసం టాయిలెట్స్ను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రతి మాట్లాడుతూ.. ఈ టాయిలెట్స్ ట్రాన్స్జెండర్స్ కోసమే ప్రత్యేకమని.. ఇతరులు ఉపయోగించరాదని అన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మరో నాలుగు టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు. ఇన్నాళ్లూ తాము పడ్డ బాధల నుంచి విముక్తి లభించిందని ట్రాన్స్జెండర్స్ సంతోషం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాల్లో కూడా టాయిలెట్స్ నిర్మించాలని ట్రాన్స్జెండర్ రోహణి కోరారు.