Rajinikanth: ‘ఎన్టీఆర్ (Ntr) యుగపురుషుడు. నా ఆరేడేళ్ల వయసులో చూసిన తొలి సినిమా పాతాళభైరవి. లవకుశ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎన్టీఆర్ ను చూశా. శ్రీకృష్ణ పాండవీయంలో ఎన్టీఆర్ ను చూసి మైమరిచిపోయా. నేను కండక్టర్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను అనుకరించి నటించి మొప్పు పొందాకే సినిమాల్లోకి వచ్చా. ఎన్టీఆర్ ప్రభావం నాపై చాలా ఉంది’ అని తమిళ అగ్ర నటుడు రజినీకాంత్ (Rajinikanth) అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ (Ntr) శతజయంతి ఉత్సవాల శంఖారావానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ఇటువంటి పెద్ద సభల్లో తెలుగు మాట్లాడి చాలా రోజులైంది. తప్పులుంటే క్షమించండి. ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో జ్ఞానం చెప్తుంది. ఎంత మాట్లాడాలో సభ చెప్తుంది. ఏం మాట్లాడకూడదో అనుభవం చెప్తుంది. సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తుంది. కానీ.. మాట్లాడొద్దురా రజినీ అని అనుభవం చెప్తోంది. చంద్రబాబు (Chandrababu Naidu) విజన్ ఉన్న నాయకుడు. 30ఏళ్ల క్రితం స్నేహితుడు మోహన్ బాబు ఆయన్ను పరిచయం చేశాడు. పెద్ద నాయకుడు అవుతాడని నాతో అన్నాడు’.
‘నిజంగానే చంద్రబాబు ఘనత దేశ విదేశీ నాయకులకు తెలిసింది. 24 గంటలూ ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఆయనది. ఐటీ గురించి ఎవరికీ తెలియని రోజుల్లేనే భవిష్యత్తు దానిదే అని చెప్పిన వ్యక్తి ఆయన. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా మార్చిన ఘనత చంద్రబాబు (Chandrababu Naidu) దే. ఇప్పుడు హైదరాబాద్ ను చూస్తే నేనున్నది హైదరాబాద్ (Hyderabad) లోనా.. న్యూయార్క్ లోనా అనిపిస్తుంది. 2024లో చంద్రబాబు గెలిచి.. 2047కు దూరదృష్టితో ఆయన వేసుకున్న ప్లాన్ అమలైతే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుంది. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది’ అని అన్నారు.
బాలకృష్ణ (Balakrishna) గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణకు కోపం ఎక్కువ. కానీ.. మనసు వెన్నపూస. సినిమాల్లో కంటిచూపుతోనే చంపేస్తాడు. ఆయన తంతే కారు 30 అడుగుల దూరంలో పడుతుంది. అలా రజినీకాంత్, అమితాబ్, షారుఖ్, సల్మాన్ ఎవరూ చేసినా చూడరు. కారణం.. ఎన్టీఆర్ ను బాలకృష్ణలో చూసుకుంటున్నారు. సినీ, రాజకీయ జీవితంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.