ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందంటే, దానికి కారణమెవరు.? ఇంకెవరు, ప్రశాంత్ కిషోర్.! తెలుగునాట కుల రాజకీయాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ కుల రాజకీయం మరింత ఛండాలంగా తయారవడానికి కారకుడు కూడా ఈ ప్రశాంత్ కిషోరే.
ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్, 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన సంగతి తెలిసిందే. కోడి కత్తి డ్రామా, వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలు.. వీటన్నిటికీ ప్రశాంత్ కిషోరే కారణమని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
‘ప్రశాంత్ కిషోర్తో జాగ్రత్త, టీడీపీలో పెద్ద తలకాయలు లేచిపోతాయ్..’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో టీడీపీకి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాయి. కారణం, టీడీపీ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేయనుండడమే. అంటే, గతంలో.. వైసీపీ కోసం ఆయన పని చేసినప్పుడు, రాష్ట్రంలో జరగకూడనివి జరగడం.. అది ఉత్త రాజకీయ ఆరోపణ కాదు, నిజమేనని అనుకోవాలా.?
ఆ సంగతి పక్కన పెడితే, టీడీపీ తరఫున ప్రశాంత్ కిషోర్ పని చేయడమంటే, రాష్ట్రానికి సమీప భవిష్యత్తులో రాజధాని వుండబోదన్న చర్చ అంతటా జరుగుతోంది. అంతే కాదు, ముందు ముందు అత్యంత నీఛంగా కుల రాజకీయాలు రాష్ట్రంలో అశాంతికి కారణమవుతాయనే అనుమానాలూ పెరుగుతున్నాయి.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అలాగే వుంటాయి. వర్గాల్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన ప్రచారాలకు తన టీమ్ ద్వారా ప్రశాంత్ కిషోర్ తెరలేపుతుంటాడు. గతంలో, రాజధాని అమరావతి విషయమై ఇలాంటి దుష్ప్రచారాలకే తెరలేపాడాయన. దాన్ని పక్కాగా అప్పట్లో వైసీపీ ఫాలో అయ్యింది.
క్రిమినల్ బ్రెయిన్.. అని ప్రశాంత్ కిషోర్ మీద నిందారోపణలు మోపిన టీడీపీ, ఇప్పుడాయన సహకారం తీసుకుంటుండడం ఒకింత ఆశ్చర్యకరమే.!