విశాఖలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో, ఆ యువకుడిపై తొలుత దాడి జరగడం, ఆ తర్వాత అతనికి శిరోముండనం చేయడం.. ఇవన్నీ కన్పిస్తున్నాయి. బిగ్బాస్2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటనపై ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. కేసు వివరాల్ని వెల్లడించారు. బాధితుడ్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు.
కాగా, నూతన్నాయుడు భార్య మధుప్రియను ఏ1 నిందితురాలిగా చేర్చారు పోలీసులు. నూతన్ నాయుడు ఇంట్లో కొన్నాళ్ళు పనిచేసి మానేశాననీ, అయితే మొబైల్ ఫోన్ పోయిందంటూ తనను ఇంటికి పిలిచి, తనపై దాడికి దిగారనీ బాధితుడు వాపోతున్నాడు. తనపై దాడి జరగడంతో, ప్రాణ భయంతో పోలీసుల్ని ఆశ్రయించాననీ, పోలీసులు తనను బాగా చూసుకున్నారని బాధితుడు చెప్పుకొచ్చాడు. మొబైల్ దొంగతనంతో తనకు సంబంధం లేదని బాధితుడు అంటున్నాడు.
మరోపక్క, నూతన్ నాయుడు కుటుంబం నుంచి ఇంకో వెర్షన్ విన్పిస్తోంది. ఇంట్లో పనిచేస్తోన్న ఓ యువతి పట్ల అభ్యకరంగా నిందితుడు ప్రవర్తించాడనీ, ఫొటోలు తీసి.. వాటిని వేరే వ్యక్తులకు పంపిస్తున్నాడనీ, ఆ విషయమై మందలించామనీ, ఈ క్రమంలో తప్పు ఒప్పుకుని గుండు గీయించుకుంటానని చెప్పి, తనంతట తానే క్షురకుల్ని తీసుకొచ్చి గుండు కొట్టించుకున్నాడని నూతన్ నాయుడు కుటుంబం చెబుతుండడం గమనార్హం.
రాష్ట్రంలో ఇటీవల ఓ పోలీస్ స్టేషన్లోనే దళిత యువకుడొకరికి శిరోముండనం జరగడం, ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాక, దేశవ్యాప్తంగానూ కలకలం సృష్టించిన విషయం విదితమే. మరో దళిత యువకుడికి శిరోముండనం.. అన్న వార్త మరోమారు దేశవ్యాప్తంగా చర్చనీయింశమయ్యింది. బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించిన వెంటనే వేగంగా స్పందించామనీ, సీసీటీవీ ఫుటేజ్ని వేగంగా సంపాదించగలిగామంటేనే.. కేసులో తామెంత వేగంగా స్పందించామనేది అర్థమవుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
🔹#Vizag లో #BiggBoss ఫేమ్ #NutanNaidu ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం కేసులో CCTVఫుటేజ్ బయటకు వచ్చింది.
🔹ఆ యువకుడిపై తొలుత దాడి చేసి శిరోముండనం చేయడం స్పష్టంగా కన్పిస్తున్నాయి
🔹#NuthanNaidu భార్య మధుప్రియతో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు#TDP #YCP #Janasena pic.twitter.com/6P4ipmZzId
— TeluguBulletin.com (@TeluguBulletin) August 29, 2020