వైసీపీ వైరస్సుకి జనసేన – టీడీపీ కలిసి పోటీ చెయ్యడమే వ్యాక్సిన్.. అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఈ మాట జనసేనాని చెబుతున్నారుగానీ, వైసీపీలోనే అంతర్గతంగా ఈ చర్చ జరుగుతోంది.
టీడీపీ – జనసేన కలిస్తే, వైసీపీకి ఓటమి తప్పదని వైసీపీ నేతలే బలంగా అభిప్రాయపడుతున్నారు. అందుకే, ‘దమ్ముంటే సింగిల్గా పోటీ చెయ్..’ అంటూ అటు టీడీపీకి, ఇటు జనసేనకీ ఉచిత సలహాలు పారేస్తూ వచ్చారు ఇప్పటిదాకా.
రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి వ్యూహాల్ని మార్చుకోవాల్సి వుంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నది అదే.! వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినప్పుడు, జనసేనకు ఓ ఐదో పదో సీట్లను టీడీపీ కేటాయిస్తే సరిపోతుందని.. టీడీపీలో చాలామంది అభిప్రాయపడ్డారు.
కానీ, పరిస్థితులు మారాయి. ‘అవసరమైతే చెరి సగం సీట్లను పంచుకుని అయినా, వైసీపీని దించాలి..’ అనే స్థాయికి వచ్చేశారు టీడీపీలో చాలామంది ముఖ్య నాయకులు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతాం..’ అంటున్నారు జనసేనాని. అంతే కాదు, ముఖ్యమంత్రి అవడానికీ సిద్ధంగా వున్నానని తెగేసి చెబుతున్నారు.
సో, ఇక్కడ విషయం సుస్పష్టం.! టీడీపీకి ఇంకో ఆప్షన్ లేదు. వైసీపీని ఓడించాలంటే, ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ సమర్థించాల్సిందే. అయితే, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది ఎన్నికల తర్వాత, ఆయా పార్టీలు గెలిచే సీట్లను బట్టి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ సైడ్ అయిపోయింది. ‘మేం జనసేనతోనే కలిసి వున్నాం..’ అని చెబుతోంది బీజేపీ. అయితే, బీజేపీ ప్రస్తావనని తీసుకురాలేదు అవనిగడ్డ వారాహి విజయ యాత్రలో జనసేనాని. ఏమో, ఆ బీజేపీ కూడా ముందు ముందు టీడీపీతో కలిసేందుకు సిద్ధమవ్వొచ్చేమో.!
బీజేపీ కలిసినా కలవకపోయినా.. టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రానికి పట్టిన వైసీపీ అనే వైరస్సుని తరిమెయ్యడం ఖాయంలానే కనిపిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.