Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సాధికారత సాధించడానికి బలమైన సంఖ్యాబలంతో శాసనసభలో అడుగుపెట్టాలన్న ధృడ సంకల్పంతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు, కులాలవారికి రాజకీయ సాధికారతతోనే న్యాయం చేయగలమని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన రాజకీయ సన్నిహితులు చెబుతున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో పోటీచేయదలచుకున్న స్థానాలు, పోటీకి నిలిపే అభ్యర్థులపై నిశితంగా అధ్యయనం చేస్తున్నారు.ఈ నెల 14 వ తేదీ నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటికి సుమారు 20 స్థానాలకు సంబంధించి అధ్యయనం మొదటి విడత పూర్తయింది. సుమారు 80 నుంచి 85 స్థానాలపై ఇటువంటి ప్రత్యక్ష అధ్యయనం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముంది?
జనసేన స్థాపించి వచ్చే మార్చితో పదేళ్లు పూర్తవుతాయి. అంతకు ముందు ప్రజారాజ్యం హయాంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. ఈ రాజకీయ ప్రయాణంలో బి.సి., ఎస్.సి., ఇతర కులాలవారు, వర్గాలు, అభిమానులు, ముఖ్యంగా ఆయన సామాజికవర్గమైన కాపులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు. ఆయన వెంట నడిచారు. వీరందరికీ న్యాయం చేసేలా అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు లోతైన కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్. సి., బి.సి., ముస్లింల అభ్యున్నతిని ఆయన కాంక్షిస్తున్నారు. మత్స్యకారులు, శెట్టిబలిజ-గౌడ ఇతర ఉపకులాలవారు, చేనేత వర్గాలు, నాయీ బ్రాహ్మణులు, కమ్మర, కుమ్మరి, రజక తదితర వృత్తి ఆధారిత సమస్త బి.సి. కులాలు, ఎస్.సి.లు ముఖ్యంగా రెల్లి కులస్తులు, అదేవిధంగా గిరిజనుల అభ్యున్నతి, వారి ఆర్ధిక పరిపుష్టికి కృషిచేయడంతో పాటు వారికి రాజకీయ సాధికారిత సంప్రాప్తించే విధంగా నియోజకవర్గాలతో పాటు అభ్యర్థుల ఎంపిక జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ధన ప్రభావాన్ని ఎలా అధిగమిస్తారు?
గత ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మరో విధంగా చెప్పాలంటే సామాన్యులు పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. డబ్బు వెదజల్లేవాడే ప్రజల దృష్టిలో బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నాడు. మరి అభ్యర్థుల ఎంపికలో ఈ అంశాన్ని ఎలా అధిగమిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్ధిక బలం కొంత సవాలుతో కూడుకున్న విషయం. దీనిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ భావజాలం, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన వారిని బరిలోకి దింపడం కొంత కష్టమైన ప్రక్రియే. అయితే ఆయనకున్న సామాజిక స్పృహ, ప్రజాభిమానంతో వీటిని అధిగమిస్తారన్న అభిప్రాయం జనసేన పార్టీ నాయకులలో కనిపిస్తోంది.
లెక్కకు మిక్కిలిగా సమాచారం:
ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాలకు చెందిన సంపూర్ణ సమాచారం ఆయనవద్ద ఉన్నట్లు తెలిసింది. వివిధ సంస్థలు చేసిన సర్వేలు, జనసేనకు బలమున్న నియోజకవర్గాలు, అటువంటి నియోజకవర్గాలలో సామాజిక సమీకరణాలు, జనసేనకు ప్రస్తుతం ఉన్న ఓట్ల బలం, తెలుగుదేశంతో కలిస్తే జతయ్యే ఓట్ల వివరాలు, విజయావకాశాలను జనసేన ప్రభావితం చేసే స్థానాలు, జనసేన ఆశావాహుల బలాబలాలు, ప్రత్యర్థి అభ్యర్థుల ప్లస్ లు మైనస్ లు వంటి సమాచారం జనసేన అధినేత వద్ద సిద్ధంగా ఉంది. వీటి అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారు.
వై.సి.పి. విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా…
ఈ అయిదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా విశ్వసిస్తున్నారు. అనేక సభలలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రయోజనాలు, తనకు మద్దతుగా నిలిచిన వర్గాల ప్రయోజనాలు కాస్త సడలించుకుని తెలుగుదేశం పార్టీ, కలిసివస్తే బి.జె.పి.తో కలసి పోటీచేయడానికి సంసిద్దమైనట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాలలో వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఓటు చీలిపోకూడదని…. ఈ కారణంగానే శ్రీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో క్లిష్ట దశలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించారు. అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల విభజన ఏ రీతిలో జరుగుతుంది? గౌరవప్రదమైన పంపకం జరుగుతుందా అనే అంశం ఆసక్తిగా మారింది.
గౌరవప్రదమైన సీట్లు అంటే ఎన్ని?
జనసేన అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన అభిలాషతో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు ,కాపులతోపాటు బి.సి., ఎస్.సి. వర్గాలకు చెందిన వారు పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తుండడంతో వీరందరిలో ఒకరకమైన ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సంఖ్య గౌరవ ప్రదంగా ఉంటుందా? గౌరవప్రదమైన సంఖ్య అంటే ఎంత? కనీసం 60 నుంచి 70? వంటి ప్రశ్నలు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే 40 నుంచి 45 స్థానాలలో జనసేన విజయం తధ్యమని, మరో 30 స్థానాలలో విజయానికి చేరువలో ఉంటుందని జనసేన వద్ద సర్వే నివేదికలు ఉన్నట్లు తెలిసింది. గౌరవప్రదమైన సీట్లు జనసేనకు దక్కినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి బదలీ అవుతాయని జనసైనికులు బాహాటంగానే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కూకట్ పల్లి ఎన్నికలలో మా నాయకుడు ఒక్క రోజు పర్యటిస్తే దగ్గరదగ్గర 40 వేల ఓట్లు వచ్చిన సంగతిని వారు గుర్తుచేస్తున్నారు.
శ్రీ లోకేష్ ప్రకటన ప్రభావమెంత?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం-జనసేన గెలిస్తే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడేనని శ్రీ నారా లోకేష్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో సంచలనమే సృష్టించింది. ఈ ప్రకటనపై జనసైనికులలో ఒకింత ఆగ్రహమే వ్యక్తమైంది. దీని ప్రభావం ఇరు పార్టీల పొత్తుపై ఎంతవరకు ఉంటుందని ప్రత్యర్థి రాజకీయ పార్టీ సైతం లెక్కలు వేసింది. ఇలా ప్రకటించడం పొత్తు ధర్మమేనా అని జనసైనికులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై జనసేనాని సంయమనం పాటిస్తున్నారని జనసైనికులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరిన తరువాత చేసిన సర్వేలలో పెరిగిన బలం చూసి శ్రీ లోకేష్ అలా మాట్లాడి ఉండవచ్చని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి పోటీ చేసేవారే లేరన్న సంగతిని వారు గుర్తుచేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనగా విజయవంతమైన యువగళం ముగింపు సభ ప్రభావం కూడా కావచ్చని జనసేన నాయకులు పేర్కొంటున్నారు. అయినా దీనిపై సరైన సమయంలో జనసేనాని తప్పకుండా స్పందిస్తారని వారు భావిస్తున్నారు.
ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-తెలుగుదేశం పొత్తు వాంఛనీయం. ఈ పొత్తు కొన్నెళ్లపాటు కొనసాగాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఎస్. సి., బి. సి., ముస్లింలు, బలిజ, కాపు, తెలగ, తూర్పు కాపులు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతే ప్రధాన అజెండాగా జనసేన ఎన్నికల వ్యూహం ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
I used to be able to find good info from your articles.
I will right away snatch your rss as I can’t to find your email
subscription link or e-newsletter service.
Do you’ve any? Please permit me realize in order that I may just
subscribe. Thanks.