రూపాయీ.. రూపాయీ.. నువ్వు ఏం చేస్తావని అడిగితే.. అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడతాను, తండ్రీకొడుకులకు విడదీస్తాను, ప్రాణ స్నేహితులను సైతం వేరుచేస్తాను, మొగుడూ పెళ్లాల మధ్య చిచ్చు పెడతాను అని అందట. డబ్బే కాదు.. రాజకీయాలు సైతం ఈ పని చేస్తున్నాయి. ఒకప్పుడు కలిసి ఉన్నవారు విడిపోతున్నారు. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, హాస్యనటుడు అలీ వ్యవహారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. తొలినుంచి ఎంతో స్నేహంగా ఉండే వీరి మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. అలీ నన్ను మోసం చేశాడని పవన్ ఆవేదన వ్యక్తంచేయగా.. అలీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అలీకి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో వెల్లడించారు.
అలీ చాలా మంచి వ్యక్తి అని, ఎంతోమందిని తన సొంత డబ్బుతో ఆదుకుంటున్న ఆయనంటే తనకు చాలా గౌరవం అని, అలీ లేకుండా తన సినిమా ఉండదని పలుమార్లు స్పష్టంచేశారు. పవన్ చెప్పినట్టే ఆయన ప్రతి సినిమాలోనూ అలీ ఉండేలా చూసుకునేవారు. తనకున్న కొద్దిమంది స్నేహితుల్లో అలీ ఒక్కరని చెప్పిన పవన్.. ఆయనకు చాలా విలువ ఇచ్చేవారు. అలీ కూడా పవన్ పట్ల అలాగే వ్యవహరించేవారు. అరె సాంబా రాసుకోరా.. అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్, అలీల మధ్య ఉండే సన్నివేశాలు సినీ ప్రేమికులు ఎంతగానో ఆశ్వాదించారు. అలాంటి మంచి స్నేహితుల మధ్య తాజా రాజకీయాలు చిచ్చు పెట్టాయి. సోమవారం రాజమండ్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. అలీ తనను మోసం చేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు.
కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని, కానీ తనకు అవసరం అయినప్పుడు అలీ తన స్వార్థం చూసుకుని మరో పార్టీలో చేరాడని ఆరోపించారు. మరో పార్టీలో చేరడడం తప్పు కాదని, కానీ అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు తనతో కలిసి పనిచేస్తానని చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. అలీ వంటివారే వదిలేసి వెళ్లిపోతే ఇంకెవరిని నమ్మాలన్నారు. అందుకే ఇలాంటి వారిని నమ్మడం కన్నా సమాజాన్ని నమ్మడం మంచిదని అభిప్రాయపడ్డారు. అలీని వైఎస్సార్ సీపీ నేతలు వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అలీ ఘాటుగా స్పందించారు. వైఎస్సార్ సీపీలో చేరడం ఏమైనా నేరమా? అదేమైనా రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నా అంటున్నారు.. నాకు డబ్బేమైనా ఇచ్చారా? లేక సినిమా అవకాశాలు ఇప్పించారా అని నిలదీశారు.
చిరంజీవి వేసిన బాటలో పవన్ కల్యాణ్ వచ్చారని, తనకు మాత్రం ఎలాంటి సపోర్ట్ లేదని పేర్కొన్నారు. పవన్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికే తాను మంచి పోజిషన్లో ఉన్నానని చెప్పారు. పవన్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వరుసలో మొదటి వ్యక్తిని తానేనని, కానీ తన గురించి పవన్ అలా మాట్లాడడం బాధేసిందని అలీ వ్యాఖ్యానించారు. పవన్ స్థానం తన గుండెల్లో ఉంటుందని చెబుతూనే అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవానికి అలీ రాజకీయాల్లోకి వచ్చేముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వరుస సమావేశాలు జరిపారు. చివరకు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో ఇప్పటివరకు పవన్, అలీలు పరస్పరం విమర్శించుకోలేదు.
అయితే, రాజమండ్రిలో అలీపై పవన్ విమర్శలు చేయడం.. అందుకు ప్రతిగా అలీ తీవ్రంగా స్పందించడంతో ఇరువురి మధ్య స్నేహానికి బీటలు ఏర్పడ్డాయి. వాస్తవానికి పవన్ కల్యాణ్.. అలీని తీవ్రంగా ఏమీ విమర్శించలేదు. ఎంతో నమ్మిన అలీ తనకు అవసరమైన సమయంలో అండగా లేకుండా వెళ్లిపోయాడంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. దీనికి అలీ ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నట్టు.. పవన్ చేసిన వ్యాఖ్యలకు అలీ హుందాగా స్పందించి ఉంటే సరిపోయేదని, వైఎస్సార్ సీపీ విధానాలు నచ్చడం వల్లే తాను ఆ పార్టీలోకి వెళ్లాననే తరహాలో సమాధానం చెప్పి ఉంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదని అంటున్నారు. రాజకీయాల కోసం ఎన్నో ఏళ్ల నాటి స్నేహం దూరం చేసుకోవడం సబబు కాదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించినా.. ఇరువురూ కలిసి మళ్లీ కనిపిస్తారా అనేది సందేహమే.